YSRCP vs TDP: తప్పు చేసిన అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేస్తే టీడీపీ నాయకులు రచ్చ చేస్తున్నారని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. గత మూడున్నరేళ్లగా కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడిని అరెస్టు చేశారని టీడీపీ బీసీ నేతలు మాట్లాడడం సమంజసమేనా అని ప్రశ్నించారు. బీసీ నాయకులు తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదా అని అన్నారు. తానూ బీసీ నాయకుడినే.. తాను తప్పు చేస్తే అరెస్టు చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు రోడ్ల మీదకు వచ్చి బీసీ నేతను అరెస్టు చేశారని కుల రాజకీయం మొదలు పెట్టారిన ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టడమే కాకుండా, ఆ స్థలానికి చెందిన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని అరెస్టు చేశారని వివరించారు. ఇంత తప్పు చేసిన అయ్యన్నను అరెస్ట్ చేస్తే.. టీడీపీ నాయకులు దాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం  చేస్తున్నారన్నారు. 



మూడున్నరేళ్లలో 9 కేసులు..


రౌడీ రాజకీయం, కక్ష సాధింపు రాజకీయం చేసింది టీడీపీ హయాంలోనే అని ఎమ్మెల్యే ఉమాశంకర్ మండిపడ్డారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో అయ్యన్నపాత్రుడుపై సుమారు 9 నుంచి 10 కేసులు వరకూ నమోదు అయ్యాయని తెలిపారు. పోలీసుల్ని బట్టలు ఊడతీసి కొడతా అంటే, మహిళా ప్రభుత్వ అధికారిని దుర్భాషలాడితే, ఒక కులాన్ని దూషిస్తూ నీచంగా మాట్లాడితే, కేసులు పెట్టరా అని ఆయన ప్రశ్నించారు. కేవలం అయ్యన్న నోటి దురుసు, అక్రమాలు, తప్పుడు పనులపైన మాత్రమే కేసులు పెట్టారే తప్ప ఎక్కడా కక్ష సాధింపు లేదని వివరించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన పంట కాలువ స్థలాన్ని ఆక్రమించుకుని, దానికి సంబధించిన ఒక ఫోర్జరీ సర్టిఫికేట్ సృష్టించి, తప్పుడు పత్రాలను ఏకంగా హైకోర్టుకు సమర్పించిన వ్యక్తిని ఆధారాలతో సహా అరెస్టు చేశారని పేర్కొన్నారు. పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో అరెస్టుకు కారణాలను స్పష్టంగా చూపారని తెలిపారు. ఏ కారణాల వల్ల నాన్ బెయిలబుల్  అరెస్టు చేస్తున్నారో స్పష్టంగా చెప్పారని వివరించారు. 


అయ్యన్న పాత్రుడు మాఫియా డాన్


ఇన్ని తప్పులు చేసినా అయ్యన్నను అరెస్టు చేయడానికి వీల్లేదని ఎలా అంటారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.  అరెస్టు సమయంలో అయ్యన్నపాత్రుడి వీడియోలు చూస్తే.. ఒక మాఫియా డాన్ ఎప్పుడూ గూండాలను వెంట పెట్టుకుని, ఒక డెన్ లో ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. ఒక మాఫియా డాన్ పోలీసులను చూసి, ఎలా బెదిరిస్తాడో, అలాగే బెదిరించాడంటూ విమర్శలు గుప్పించారు. పోలీసులను మీ అంతు చూస్తాను అని బెదిరించినవాడిని చట్టానికి కట్టుబడ్డ వ్యక్తి అంటారా.. లేక.. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారా..? అని టీడీపీ నాయకులను నిలదీశారు. 


అయ్యన్న నేరానికీ, బీసీలకు ఏం సంబంధం..?


అయ్యన్నపాత్రుడు చేసిన ఈ నేరానికీ, తమకూ సంబంధం ఉందని టీడీపీ చెబుతోందని ఎమ్మెల్యే ఉమా శంకర్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరుగుతున్నది జగన్ ప్రభుత్వంలో మాత్రమే అన్న నిజం బీసీలు గమనించారని అన్నారు. మిగతా సామాజిక వర్గాలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నాయన్నారు. ఇంగ్లీషు మీడియం వద్దన్నవారు, ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి వీల్లేదని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుపడిన వారు, బీసీల పక్షపాత వ్యక్తులు అవుతారా..? అని ప్రశ్నించారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నవారు బీసీ అనుకూలులు ఎలా అవుతారంటూ ధ్వజమెత్తారు. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని మాట్లాడినవారు బీసీలను సమర్థించినట్టా అని ప్రశ్నించారు. గంజాయి వ్యాపారి చట్టబద్ధ వ్యాపారస్థుడు ఎలా అవుతాడని మండిపడ్డారు. దొంగ సంతకాలు పెట్టి డాక్యుమెంట్లు తారుమారు చేసిన వ్యక్తి దేశ భక్తుడా లేక తెలుగుదేశం భక్తుడో మీరే ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.


ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాస్, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా.. వీరంతా సంఘ సేవకులా లేక రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులా.. అంటూ ఎమ్మెల్యే ఉమాశంకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీరిని అరెస్టు చేస్తే చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందన్నారు. ఈ దొంగతనాన్ని సమర్థించే పత్రికలు, టీవీలు.. దొంగ పత్రికలూ, దొంగ టీవీలా కాదా అని అన్నారు.