Graduates MLC Elections in AP: పట్టభద్రుల నియోజకవర్గాలపై వైసీపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయింది. ముఖ్యంగా సచివాలయం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వాలంటీర్లలో ఉన్న పట్టభద్రులు.. ఇలా అందరూ వైసీపీకే ఓటు వేస్తారని ఆ పార్టీ భావించింది. అదే ధీమాతో అభ్యర్థులను బరిలో దించింది. కానీ సీన్ రివర్స్ అయింది. ఒకటి కాదు, రెండు కాదు.. పోటీ జరిగిన మూడుచోట్లా టీడీపీ అభ్యర్థులే గెలిచారు. అధికార పార్టీ వైసీపీకి సవాల్ విసిరారు.


ఏపీలో ఐదు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ రెండింట, టీడీపీ మూడుచోట్ల విజయం సాధించింది. క్లియర్ గా చెప్పాలంటే టీచర్ ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలో, పట్టభద్రుల స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఒకరకంగా టీచర్ ఎమ్మెల్సీలను గెలవడం వైసీపీ గొప్పతనం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ టీచర్లలో ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని అధిగమించి వైసీపీ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి.. టీచర్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ప్రైవేట్ టీచర్ల ఓట్లతోపాటు, ప్రభుత్వ టీచర్లలో కూడా కొంతమంది వైసీపీ అభ్యర్థులకు జై కొట్టడంతో ఫలితాలు అలా వచ్చాయి.


ఇక పట్టభద్రుల స్థానాల్లో వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులు మూడుచోట్లా ఓడిపోయారు. పశ్చిమ రాయలసీమలో హోరాహోరీ పోరు నడిచినా అంతిమ విజయం టీడీపీదే కావడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమ రాయలసీమలో టీడీపీ అభ్యర్థి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు.


ఎక్కడ తేడా కొట్టింది..?


తాజాగా ఎమ్మెల్సీ ఫలితాలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా లక్షా 30వేల సచివాలయ పోస్ట్ లు భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. మరి 9 జిల్లాలో పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆ సచివాలయ ఉద్యోగులంతా ఎవరికి ఓటు వేశారు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు ఎవరికి వేయించారు. 9 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 90వేలకు పైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారి ఓట్లన్నీ వైసీపీకి పడితే గెలుపు ఖాయమైపోయి ఉండేది. కానీ అలా జరగలేదు. అందుకే వైసీపీ ఓడిపోయింది.


వైసీపీకి మొదటినుంచీ టీచర్ల నియోజకవర్గం కంటే పట్టభద్రుల నియోజకవర్గంపైనే ఎక్కువ గురి ఉండేది. అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలతో కలసి ప్రచారానికి వెళ్లిన సమయంలో సచివాలయ స్టాఫ్ తో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకునేవారు. ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరి కుటుంబాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే లెక్క పక్కాగా వైసీపీ దగ్గర ఉంది అంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ పోల్ మేనేజ్ మెంట్ లో వెనకపడింది. మూడు సీట్లను టీడీపీకి దారాధత్తం చేసింది.


వ్యతిరేకత లేదంటే ఎలా..?


పట్టభద్రుల నియోజకవర్గాల పరిధి చిన్నది, వారి ఓటింగ్ ని అందరికీ ఆపాదించలేం. అందులోనూ అవి టీడీపీ ఓట్లు కావు, పీడీఎఫ్, ఇతరుల ఓట్లన్నీ టీడీపీకి పడ్డాయనేది సజ్జల వాదన. మరి టీచర్ల నియోజకవర్గంలో దక్కిన విజయాన్ని వారు వైసీపీ విజయంగా ఎలా భావిస్తారు. అక్కడ దక్కిన విజయం ఇక్కడ లభించకపోవడానికి కారణాలేంటి అనే విషయాన్ని మాత్రం వైసీపీ చెప్పలేకపోతోంది. దీన్ని ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతగా చూడటంలేదంటున్నారు నేతలు. కానీ ఒకేసారి లక్షా 30వేల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసి.. డీఎస్సీ పూర్తిగా లేకపోవడం, గ్రూప్స్ లో అరకొర పోస్ట్ లు భర్తీ చేయడం వంటివి.. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయని చెప్పొచ్చు. అందుకే పట్టభద్రుల నియోజకవర్గాల్లో వైసీపీ బోల్తా పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.