అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీలో అవలంభిస్తున్న విధానాన్ని గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలోనూ పాటించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కోరారు. గ్రూప్ 1 ఉద్యోగార్థుల పక్షాన నిలుస్తూ సీఎం చంద్రబాబుకు షర్మిల విజ్ఞప్తి చేశారు.


ఆ లేఖలో ఏముందంటే.. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల పక్షాన మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. గ్రూప్2, డిప్యూటీ DEO పోస్టుల ఎంపికలో 1:100 విధానాన్ని అనుసరించినట్లే, గ్రూప్ 1 మెయిన్స్ కి సైతం 1:100 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలి. గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడం,కేవలం మూడు వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు జరగడం, గ్రూప్‌ 1 సిలబస్‌ను రివిజన్‌ చేయలేకపోవడం,కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టడం లాంటి కారణాలతో నష్టపోయామని అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు. అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై వెంటనే సాధ్యసాద్యాలు పరిశీలించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం’ అని తనకు గ్రూప్ 1 అభ్యర్థులు తమకు రాసిన లేఖను ఎక్స్ ఖాతాలో షర్మిల పోస్ట్ చేశారు.