YS Sharmila Comments on Sharmila: సొంత చెల్లెలు మీద ఇంగితం లేకుండా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని ఏపీపీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల అన్నారు. వేలమంది సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టలు మీద ప్రస్తావన చేస్తారా? ఎంత దిగజారుడు రాజకీయాలు.. అంత ఏం అవసరం ఉంది? అని షర్మిల నిలదీశారు. ‘‘నేను బాబు దగ్గర మోకరిల్లానట? పసుపు చీర కట్టుకున్నానట.. చంద్రబాబు స్క్రిప్ట్ నేను చదువుతున్నానట. పసుపు కలర్ ఏమైనా చంద్రబాబుకి పేటెంట్ రైటా? చంద్రబాబు పచ్చ కలర్ కొన్నారా? జగన్ రెడ్డి మరిచిపోయాడు. గతంలో సాక్షి ఛానెల్ కి పసుపు రంగు ఉండేది. స్వయంగా వైఎస్ఆర్ చెప్పాడు.. పసుపు మంగళకరం అయిన రంగు. అది టీడీపీ సొంతం కాదు అని వైఎస్ఆర్ అన్నారు’’ అని షర్మిల ఆక్షేపించారు. గుంటూరులో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసంగించారు.


మోదీకి జగన్ దత్తపుత్రుడు
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు చీర గురించి మాట్లాడతారా? నా ఒంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా? జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా?చూసుకుంటూ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేది జగన్ రెడ్డే. మక్కీకి మక్కీ చదివేది జగన్ రెడ్డి. నేను వైఎస్ఆర్ బిడ్డను.. నాకు మోకరిల్లె అవసరం లేదు. మీ కుక్క బిస్కెట్లు తిని ఎంతో మంది నాపై తప్పుడు ప్రచారం చేసినా పట్టించుకోలేదు. బీజేపీ దగ్గర మోకరిల్లింది మీరు. మోదీకి దత్తత పుత్రుడు జగన్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు మాట్లాడలేదు. జగన్ రెడ్డి వైఎస్ఆర్ వారసుడు కాదు. మోదీకి వారసుడు. క్రైస్తవులను చంపుతుంటే మోదీకి మద్దతు పలికాడు.


రోజా, రజినీనే జగన్ కు చెల్లెళ్లు
అయ్యా మీకు ఇవ్వాళ బందువులు ఎవరు? మీకోసం పరితపించిన వాళ్ళు ఇవ్వాళ మీ వెనకా ముందు ఉన్నారో చూస్కోండి. జగన్ రెడ్డితో చెల్లెల్లు ఎవరు లేరు. వైఎస్ఆర్ ను తిట్టిన రోజా, రజినీ ఇప్పుడు జగన్ కి చెల్లెళ్లు. అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్ ను తిట్టిన వాళ్ళు ఈయనకు బంధువులు. సీబీఐ వైఎస్ఆర్ పేరును అసలు చార్జీ షీట్ లో చేర్చలేదు. ఇవ్వాళ అసలు విషయాలు చెప్తున్నా. సీబీఐ ఛార్జిషీట్ లో వైఎస్ఆర్ పేరు చేర్పించింది జగన్ మోహన్ రెడ్డి లాయర్. కేసు నుంచి జగన్ ను బయట పడేసేందుకు వైఎస్ఆర్ పేరును సీబీఐ చార్జిషీట్ లో చేర్పించాడు. ప్రతిఫలంగా జగన్ కు మేలు చేసినందుకు అదే సుధాకర్ రెడ్డికి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చాడు.


మీలో ఉన్నది గుండెనా..? బండనా? 
ఇది వాస్తవం కాదా జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మమ్మల్ని తిట్టిపోసే మీరు ఆలోచన చేసుకోండి. సౌభాగ్యమ్మ లెటర్ రాస్తే కనీసం స్పందన లేదు. మీలో ఉన్నది గుండెనా..? బండనా? సొంత చిన్నాన్నను చంపిన వారిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. హంతకులను రక్షిస్తూ వాళ్ళకే ఎంపీ టిక్కెట్లు ఇచ్చారు. జగన్ ఇవ్వాళ పులివెందులకు వెళ్ళారు. వివేకానంద రెడ్డి ప్రస్తావన తీశారు. ఒక్క మంచిమాట కూడా జగన్ నోట నుంచి రాలేదు. వివేకాకు రెండో పెళ్లి అయ్యిందట.. ఇంకో సంతానం ఉందట. వివేకా ప్రజా నాయకుడు అని గానీ.. వైఎస్ఆర్ కి తమ్ముడు అని ఎందుకు చెప్పలేదు? వైసీపీ కోసం ఎంత పని చేశారు వివేకా? ఇదేమి గుర్తుకు రాలేదా? వీళ్ళు వివేకా గురించి మాట్లాడొచ్చు అంట..మేము మాట్లాడొద్దు అంట


మీకు దేవుడు ఇంగితం ఇవ్వలేదా?
మేము మాట్లాడకూడదనే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు. అవినాష్ రెడ్డి చిన్నవాడు అంట.. మంచోడు అంట. ఆయన భవిష్యత్ పాడు చేస్తున్నమట. అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టినప్పుడు మేము ఎదురు చెప్పలేదు. వివేకా వద్దు వద్దు అన్నా మేము కాదు అనలేదే. వివేకా హత్య రోజు మేము అవినాష్ రెడ్డి నిందితుడు అని చెప్పలేదు కదా. మాకు అవినాష్ రెడ్డి భవిష్యత్ పాడు చేసే అవసరం లేదు. ఎందుకు అవినాష్ రెడ్డిని నమ్ముతున్నారు గుడ్డిగా? మీకు దేవుడు ఇంగితం ఇవ్వలేదా ? ఆలోచన శక్తి లేదా? CBI అన్ని ఆధారాలు చూపిస్తుంటే మీకు కనపడటం లేదా? మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు సమాధానం చెప్పాలి. సాక్షి ఛానెల్ లో వివేకా హత్యను గుండెపోటుగా చూపించారు. అధికారంలో లేనప్పుడు CBI దర్యాప్తు కావాలని అడిగారు. అధికారంలోకి వచ్చాక CBI దర్యాప్తు వద్దు అన్నారు. మామ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడు.. సాక్ష్యాలు తుడుస్తుంటే అవినాష్ నిలబడి చూశాడు అని’’ అని వైఎస్ షర్మిల జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.