Chandrababu Red Book Rule Jagan:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సరికొత్త అజెండాను ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన ఏపీ రాజధానిగా చంద్రబాబు ప్రతిపాదిస్తున్న అమరావతిని మరోసారి తిరస్కరించారు. తాము తెచ్చి మావిగన్  కారిడార్ అభివృద్ధి ప్రతిపాదనకే తమ పార్టీ సంపూర్ణంగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల సమరం ప్రధానంగా మావిగన్ వర్సెస్ అమరావతి మధ్యే ఉంటుందని, ఈ రెండు రాజధాని నమూనాలలో ప్రజల మద్దతు దేనికి ఉందో వచ్చే ఎన్నికల్లోనే తేలిపోతుందని జగన్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ మావిగన్ కారిడార్ ప్రతిపాదనను అధికారికంగా చేరుస్తామని ఆయన వెల్లడించారు.  నేను అమరావతికి వ్యతిరేకం కాదు.. బాబు స్కామ్‌లనే ప్రశ్నిస్తున్నా! 

Continues below advertisement

‘జగన్ అమరావతికి వ్యతిరేకం’ అంటూ కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాను అమరావతి ప్రాంతానికి గానీ, అక్కడి రైతులకు గానీ వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు. అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు సాగిస్తున్న వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ స్కామ్‌లను, అవినీతిని మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. శూన్యం నుండి అమరావతిని నిర్మించడానికి లక్షల కోట్లు ఖర్చు చేయడం రాష్ట్ర భవిష్యత్తును భ్రమల్లో నెట్టడమేనని విమర్శించారు. దానికి బదులుగా.. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్, పోర్టు, జాతీయ రహదారుల వంటి మౌలిక సదుపాయాలు ఉన్న 110 కిలోమీటర్ల 'మావిగన్' ప్రాంతాన్ని రాజధాని కారిడార్‌గా మార్చడమే అత్యంత ఆచరణాత్మకమైన పరిష్కారమని, అవినీతి లేని రాజధాని కావాలనేదే తన ఆకాంక్ష అని జగన్ వివరించారు.  SIR  పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర.. చివరికి సిటిజన్‌షిప్ లేకుండా చేస్తారా? 

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం  ‘SIR’  పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను వ్యవస్థాగతంగా తొలగించే పెద్ద కుట్ర చేస్తోందన్నారు.  ఓట్లను తొలగిస్తే భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలా వస్తాయి? అసలు ఓట్లు తీసేసి చివరికి ఈ రాష్ట్రంలో పౌరులకు సిటిజన్‌షిప్  కూడా లేకుండా చేస్తారా?" అని జగన్ నిలదీశారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫామ్స్  ఇవ్వకుండానే, ఇచ్చినట్లు రాయాలంటూ చంద్రబాబు అధికారులను ఆదేశిస్తున్నారని, ప్రతి పోలింగ్ బూత్‌లో 40 నుండి 50 వైసీపీ ఓట్లను తొలగించాలని చూస్తున్నారని, దీనిపై తమ క్యాడర్ గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.   

Continues below advertisement

  రైతాంగం రోడ్డున పడింది.. మూడు బడ్జెట్లు పెట్టినా ధరల స్థిరీకరణ శూన్యం! 

రాష్ట్రంలోని ఆర్థిక, వ్యవసాయ పరిస్థితులపై జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ఏ పంటకూ కనీస గిట్టుబాటు ధర లేదని విమర్శించారు. అసెంబ్లీలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే కేటాయించారని ఎద్దేవా చేశారు. "రైతులు పంట పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో పొగాకు రైతులు రోడ్డెక్కుతున్నారు, ఆక్వా రైతులు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మా హయాంలో తెచ్చిన ‘అప్సడా’ చట్టాన్ని పక్కనబెట్టి ఫీడ్ సిండికేట్లకు బాబు కొమ్ముకాస్తున్నారు" అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాది సంక్షేమ పాలన.. బాబుది ‘రెడ్ బుక్’ అరాచక రాజ్యాంగం 

తమ ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో నిరంతరం విద్యా, వైద్యం, ఆర్బీకేలు , పేదల సంక్షేమం గురించి చర్చ జరిగేదని.. కానీ చంద్రబాబు సీఎంగా వచ్చాక రాష్ట్రంలో కేవలం  రెడ్ బుక్ రాజ్యాంగం , కస్టోడియల్ డెత్స్  మీదనే చర్చ జరుగుతోందని జగన్ దుయ్యబట్టారు. విజయవాడ పరిధిలో జరిగిన సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాల కేసుల్లో నిజాలను కప్పిపుచ్చడానికి కృష్ణలంక పీఎస్ సీసీటీవీ ఫుటేజీలను డిలీట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో  రూల్ ఆఫ్ లా  పూర్తిగా పక్కకుపోయి, ‘రూల్ ఆఫ్ ఫియర్’  రాజ్యమేలుతోందని, సాధారణ ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయని జగన్ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న టాపిక్ డైవర్షన్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.