YS Jagan on Chandrababu Naidu: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలోని బాలికల హాస్టల్‌ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే ఆరోపణల వేళ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని విమర్శించారు. ఈ మధ్య చాలా స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ అయిందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సీఎం కుమారుడే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు.


‘‘చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గాలికొదిలేశారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది.


ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు. మరోవైపు గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో హిడెన్‌ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇది. చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి.






అసలేం జరిగిందంటే..
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ కాలేజీలో బాలికల హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలను కొందరు విద్యార్థినులు గురువారం గుర్తించి హాస్టల్ వార్డెన్‌కు కంప్లైంట్ చేశారు. దీనిపై అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళన కూడా చేశారు. ఈ క్రమంలో కాలేజీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ అమ్మాయే ఈ హిడెన్ కెమెరాలు పెట్టిందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఆ బాలిక ఇంత దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీలను విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిందని.. దోషులు ఎంతటివారైనా వదిలేది లేదని మంత్రి తేల్చి చెప్పారు.