Ambati Rambabu on Kadambari Jethwani Case: ముంబయికి చెందిన నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి ప్రభుత్వం తమ పార్టీని టార్గెట్ చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుతోపాటు, ఆయన అనుకూల మీడియా కలిసి ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. అసలు సజ్జల రామక్రిష్ణారెడ్డికి ఈ కేసుతో సంబంధం ఏంటని అంబటి ప్రశ్నించారు. కుక్క తోకను పట్టుకుని గోదావరి ఈదినట్టుగా ఈ కేసులో చంద్రబాబు ప్రభుత్వ హడావుడి ఉందని అన్నారు. అదంతా త్వరలోనే భూమ రాంగ్ అవుతుందని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియా సమావేశంలో మాట్లాడారు.


నటి కాదంబరి జెత్వానీ ఒక మాయలేడీ అని, ఆమె వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ కుంభకోణం చేసినందున గతంలో అరెస్టు అయ్యారని.. ఆయన్ని అరెస్టు చేసిన అధికారులపై కక్ష కట్టి ఐపీఎస్‌ల మీద పగ సాధిస్తున్నారని అన్నారు. బాలకృష్ణ కాల్పుల కేసును కూడా బయటకు తీయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.