అమరావతి: ఏపీ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, తాజాగా గ్రూప్ 2 అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఎదుర్కొన్న పరిస్థితే అందుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ అంటోంది. గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేస్తానని మంత్రి లోకేష్ మోసపూరిత చేశారని, చివరికి మీ వాయిస్‌తో ఆడియోను లీక్‌ చేస్తూ మరో డ్రామా చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

1. చంద్రబాబు.. నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు అన్నివర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు గ్రూప్‌-2 అభ్యర్థులనుకూడా నిలువునా మోసం చేశారు.

2. మూడు వారాలుగా గ్రూప్‌-2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి, వాటిని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం చేస్తున్నట్టు నమ్మబలికి, చివరకు వారిని నట్టేటా ముంచారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞాపనలను వింటున్నానని, తప్పకుండా పరిష్కారం చూపిస్తానని పరీక్షలకు రెండు రోజులముందు విద్యాశాఖమంత్రి, మీ కుమారుడు నారా లోకేష్ మోసపూరిత ప్రకటన చేశారు, మరోవైపు తాను చెప్పినా సరే, ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చినా సరే పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ముందుకు వెళ్తోందని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న మీ వాయిస్‌తో ఆడియోను లీక్‌ చేస్తూ మరో డ్రామా చేశారు. ఇంకోవైపు ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులతో లాఠీఛార్జి చేయించి అమానుషంగా ప్రవర్తించారు. ప్రజలను ఎలా మోసం చేస్తారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమే. ఆఖరికి అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణం.

3. మా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం  ఒక మోసమే.

4. ప్రతి జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పి, అసలు దాని గురించి పట్టించుకోకపోవడం కూడా మీరు  చేసిన మోసమే.

5. వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చెప్పి, జీతం సంగతి దేవుడెరుగు చివరకు 2.6లక్షలమంది ఉద్యోగాలను ఊడగొట్టడమూ మోసమే.

6. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది కుదింపు పేరిట, వీరిని వేరే డిపార్ట్‌మెంట్లకు సర్దుబాటు చేసి, అక్కడ ఖాళీలకు శాశ్వతంగా కోతపెట్టడమూ మోసమే.

7. నిరుద్యోగ భృతి అని, నెలనెలా రూ.3,000 అని, ప్రతి ఇంటినీ మోసం చేయడం, ఇంకో మోసం.

8. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 18వేలమందిని, ఫీల్డ్‌ అసిస్టెంట్లనూ, ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌లోనూ, ఏపీ ఎండీసీలోనూ, వైద్య ఆరోగ్య శాఖలోనూ పనిచేస్తున్నవారిని తొలగించి వారి జీవితాలను నడిరోడ్డుపై నిలబెట్టడము కూడా మీరు చేస్తున్న మోసాల్లో భాగమే.

9. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్న మీ హామీపై ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఉద్యోగులకు చేస్తున్న మోసమే.

10. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అంటూ  ఉన్న పీఆర్‌సీ ఛైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించి, కొత్త పీఆర్‌సీ ఇంతవరకూ వేయకపోవడమూ ఇంకో మోసమే.

11. ఒకటో తేదీనే జీతాలు అంటూ, ఒకే ఒక నెల మాత్రమే ఇచ్చి, ఆతర్వాత ప్రతినెలా ఉద్యోగులు ఎదురుచూసేలా చేయడం కూడా మీరు చేసిన మోసాల్లో భాగమే.

12. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 3 డీఏలు పెండింగ్‌లో పెట్టడం కూడా ఒక అన్యాయమే.

13. ట్రావెల్‌ అలవెన్స్‌లు, సరెండర్‌ లీవ్స్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌.. అన్నీ పెండింగ్‌లో పెట్టడంకూడా ఇంకో అన్యాయమే.

14. ఉద్యోగస్తులకు సంబంధించిన వారి జీఎల్‌ఐ, జీపీఎఫ్‌ కూడా మీ అవసరాలకు వాడేసుకుని ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టించడం కూడా మీరు చేస్తున్న అన్యాయాల్లో భాగమే.

15. ఈ మోసాలకు, ఈ అన్యాయాలకు కేరాఫ్‌గా మారిన చంద్రబాబునాయుడుగారూ.. మీ వైఖరిపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు, పోరాటాలు చేస్తున్నారు. ప్రజా పోరాటాలకు ఎప్పుడూ మా పార్టీ తోడుగా నిలుస్తుంది.

Also Read: Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణంలో కీలక పరిణామం, హైదరాబాద్ ORRను మించేలా మాస్టర్ ప్లాన్