All India Couple Tour : ఇటీవల కాలంలో డబ్బు, ఆస్తులు సంపాదన మీద కన్నా మానసిక ఆనందం, దేశంలోని భిన్న సంస్కృతి సంప్రదాయాలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆకాంక్ష ఎక్కువ మందిలో కలుగుతోంది. లక్షల రూపాయలు జీతాలు పొందే సాఫ్ట్​ వేర్​ ఉద్యోగాలు, కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహించే వ్యాపారవేత్తలతో పాటు సామాన్యులు సైతం ఇప్పుడు టూర్ల బాటపట్టారు. కొందరు ద్విచక్ర వాహనాలపై, మరికొందరు ఖరీదైన కారులో యాత్ర సాగిస్తూ ఉంటారు. పర్యావరణానికి ఏ విధమైన హాని కలగకుండా పశ్చిమ బెంగాల్ ​కు చెందిన భార్యాభర్తలు భారతదేశమంతా తిరిగి రావాలనే ఆకాంక్షతో సైకిల్ ​పై తమ ప్రయాణాన్ని ప్రారంభించి రాష్ట్రాలు దాటుకుంటూ కేంద్రపాలిత ప్రాంతమైన యానాం చేరుకున్నారు. 


గత ఏడాది అక్టోబర్ 27న టూర్ ప్రారంభం 


పశ్చిమ బెంగాల్లో ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే ప్రదీప్ దేవనాద్, అతని భార్య సంగీత దేవనాద్ గత ఏడాది అక్టోబర్ 27వ తేదీన బెంగాల్ నుంచి భారతదేశ యాత్రకు సాధారణ సైకిల్ పై బయలుదేరారు. ఇన్ని రోజుల్లో దేశం చుట్టూ తిరిగే రావాలనే సమయం నిర్దేశించుకోకుండా ఆయా రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు, ఆ ప్రాంతాల్లో ఉండే పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ దేవాలయాలు సందర్శిస్తూ, స్థానిక ప్రజలతో మమేకమై భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకుంటున్నారు. ఆ వివరాలను తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఎప్పటికప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న పుదుచ్చేరికి చెందిన ప్రముఖ పర్యటక ప్రాంతమైన యానాంలో ఈ జంట సైకిల్ పై షికారు చేయడం స్థానికులను ఆకర్షించింది. శివమ్ బాత్,  భరతమాత విగ్రహాల వద్ద భార్యాభర్తలు సెల్ఫీలు దిగుతూ గౌతమి గోదావరి నది అందాలను వీక్షించారు.


పర్యావరణానికి హాని లేకుండా సైకిల్ పై యాత్ర 


"గత ఏడాది అక్టోబర్ 27న సైకిల్ యాత్ర ప్రారంభించామని, ప్రతిరోజు మేముండే ప్రాంతాల్లో విశిష్టతలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. స్థానికులు ఇచ్చే సలహాలు స్వీకరిస్తూ ఆలయాలు.. పర్యాటక ప్రదేశాల్లో బస చేస్తూ మా ప్రయాణం సాగిస్తున్నాం. చిన్న ప్రాంతమైనా యానాం అభివృద్ధి, పర్యటకంగానూ ఆకర్షణీయంగా ఉంది. తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని లేకుండా ఉండాలనే సైకిల్ పై యాత్ర చేస్తున్నాం ". ప్రదీప్ దేవనాధ్, సంగీత దేవనాధ్


మహిళల భద్రత కోసం ఆశా మాల్వియా సైకిల్ యాత్ర 


భారతదేశంలో మహిళకు ప్రత్యేక భద్రత ఉందని, అందులో భాగంగానే దేశం మొత్తం సైకిల్ మీద ప్రయాణిస్తూ మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్టు పర్వతారోహకురాలు ఆశా మాల్వియా స్పష్టం చేశారు. గత ఏడాది నవంబర్ 1న భోపాల్‌లో తన  ప్రయాణాన్ని ప్రారంభించిన ఆశా మాల్వియా సైకిల్ యాత్ర  7 రాష్ట్రాలను దాటి  8వ రాష్ట్రమైన ఏపీలోకి చేరింది. సోమవారం ఉదయం ఆమె తిరుపతికి చేరుకుంది. అందులో భాగంగా ఆమెకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆనంతరం తన కార్యాలయంలో ఆమెకు సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. మహిళ సాధికారత భద్రతపై అవగాహన కల్పిస్తూ ఇలా 25 వేల కిలోమీటర్లు ప్రయాణించడం అద్భుతం అన్నారు. అలాగే ఆశా మాల్వియా మాట్లాడుతూ.. మహిళకు భద్రత కలిగిన దేశం మన ఇండియా అని చాటి చెప్పడానికే  సైకిల్ పై 25 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 8,200 కిలోమీటర్లు ప్రయాణించానన్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం తన యాత్ర పునఃప్రారంభిస్తానని ఆమె పేర్కొన్నారు.