ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో స్వల్ప వర్ష సూచన అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఉపరితల ఆవర్తనం బుధవారం (నవంబర్ 29) నాటికి మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర దిశగా పయనించిందని అధికారులు తెలిపారు. మరోవైపు, డిసెంబరు 4 లేదా 5 తేదీల్లో అండమాన్‌ సముద్రంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత అది పశ్చిమ వాయువ్యంగా పయనించి బలపడుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఇప్పుడు ఏపీ, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


ఈ వాతావరణ పరిస్థితుల నడుమ దక్షిణ కోస్తాలో డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.


రాష్ట్రం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీయడంతో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉన్నట్లుగా తెలిపారు. అటు మధ్య భారతంలో నెలకొన్న చలి గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాలో చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.


అదంతా ఫేక్ తుపాను నమ్మొద్దు - ఏపీ వెదర్ మ్యాన్
‘‘డిసెంబరు మొదటి వారంలో దక్షిణాంధ్రలో వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వరకు మాత్రమే ఉంటుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి అల్పపీడన ద్రోణిగా మారి దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు వైపుగా వస్తోంది. దీని వలన డిసెంబరు 1 నుంచి నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము. నెల్లూరు నగరంలో కూడ కొన్ని వర్షాలుంటాయి. డిసెంబరు 2 నుంచి 4 మధ్యలో తిరుపతి జిల్లాలోని అన్ని భాగాలు ముఖ్యంగా తిరుపతి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము. అన్నమయ్య​, ప్రకాశం కోస్తా భాగాల్లో కూడా, చిత్తూరు జిల్లాలోని కొన్ని వర్షాలను చూడగలము. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప జిల్లాలో తక్కువగానే వర్షాలుండనున్నాయి. 


మిగిలిన అన్ని ప్రాంతాల్లో వర్షం ఉండదు. విశాఖ​, విజయవాడ​, కాకినాడ​, రాజమండ్రిలో కూడా వర్షాలు ఉండవు. ముఖ్యమైన గమనిక - విండీ యాప్ లో ఏదో తుఫాను ఆంధ్ర వైపుగా చూపిస్తూ ఉందని ఫేక్ న్యూస్ ఛానల్స్ చాలా దారుణంగా భారీ తుఫాన్ అని మరో పది రోజుల వరకు ఫేక్ న్యూస్ ని చెప్పనున్నారు. వాస్తవానికి ఈ సమయంలో ఏర్పడే తుఫాన్లు ఆంధ్రా వైపుగా రావడం చాలా అరుదు. ఇంకా చాలా సమయం ఉంది. దయజేసి విండీ ఆప్, ఫేక్ న్యూస్ గాలులను నమ్మి భయపడకండి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.


తెలంగాణ వాతావరణం ఇలా..
తెలంగాణలో నేటి (నవంబరు 29) నుంచి వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. కానీ, చలి తీవ్రత సాధారణంగానే ఉంటుందని అంచనా వేశారు.


హైదరాబాద్‌లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 15 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలివేగం గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.


వివిధ చోట్ల చలి ఇలా..
నిన్న తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విపరీతమైన చలి ఉంటోందని తెలిపారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లోనూ కనిష్ణ ఉష్ణోగ్రత 11 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతోంది. ఈ జిల్లాలకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. 


నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కనిష్ణ ఉష్ణో్గ్రతలు 15 డిగ్రీలకు మించి నమోదవుతుండడంతో ఇక్కడ ఎలాంటి అలర్ట్ లు జారీ చేయలేదు.