దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గర్లో ఉన్న బలమైన అల్ప పీడనం పశ్చిమ దిశగా కదులుతోంది. రానున్న దిశలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, శ్రీలంక వైపుగా వెళ్తుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు వాతావరణం దాదాపు అన్ని చోట్ల పొడిగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. 


అల్పపీడన ప్రభావంతో బుధవారం (డిసెంబర్ 21) నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండనున్నాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల చలి ప్రభావం కొనసాగుతోంది.


‘‘వెస్టర్న్ డిస్టెర్బెన్స్ (హిమాలయాల మీదుగా వెచ్చే గాలులు) వలన మన అల్పపీడనం వెల్లాల్సిన దిశ కాకుండా ఉత్తర దిశగా వెళ్లి దక్షిణం వైపుగా వెళ్లనుంది. కానీ వర్షాలు ఎప్పుడు మనకు పడనున్నాయి అనేది చూస్తే.. బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదిలి శ్రీలంక తూర్పు కోస్తా భాగం మీదుగా వెళ్లనుంది. దీని వలన మనం భారీ వర్షాలను శ్రీలంకలో అలాగే దక్షిణ తమిళనాడులో చూస్తామే కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం తేలికపాటి, మోస్తరు వర్షాలను మాత్రమే చూడగలము. డిసెంబరు 25 నుంచి 27 మధ్యలో ఇలాంటి వాతావరణం ఉంటుంది. అది కూడా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకే పరిమితం అవుతుంది. మిగిలిన చోట్లల్లో అక్కడక్కడ మాత్రమే, తక్కువ చోట్లల్లో మాత్రమే ఈ ప్రభావాన్ని చూడగలము’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఉత్తర కోస్తా, యానాం
వచ్చే మూడు రోజులు (బుధ, గురు, శుక్రవారం) పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాంధ్ర
వచ్చే మూడు రోజులు (బుధ, గురు, శుక్రవారం) పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.


రాయలసీమ
వచ్చే మూడు రోజులు (బుధ, గురు, శుక్రవారం) నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.


ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉంటూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.