ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి ఉపరితల గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చలి, వేడి వాతావరణం కొనసాగుతోంది. రాత్రుళ్లు చల్లగా ఉంటే మధ్యాహ్నం మాత్రం వేడిగా, మళ్లీ కోస్తాంధ్రలో మాత్రం కాస్తంత ఉక్కగా ఉంది. ఈ రోజు అత్యల్పంగా విశాఖ ఏజెన్సీ అరకు వ్యాలీలో 8.3 డిగ్రీలు నమోదయ్యింది. మరో పక్కనేమో అత్యధికంగా కర్నూలు జిల్లా నంధ్యాలలో 36 డిగ్రీలు నమోదయ్యింది. ఇలాంటి వాతావరణం మరో మూడు రోజులు ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.


తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.



హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 6 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.2 డిగ్రీలుగా నమోదైంది.