Weather Warnings: రాష్ట్రంలో బుధ, గురువారాలు వడగాల్పులతో తీవ్రంగా ఇబ్బంది పెడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్పా మధ్యాహ్నం వేళలో ఇంట్లో నుండి బయటకు రావొద్దని సూచించింది. ఐఎండీ అంచనాల ప్రకారం బుధవారం రాష్ట్రంలోని 98 మండలాల్లో వడగాల్పులు, గురువారం 70 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. 


బుధవారం మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్లూరి జిల్లాలోని 7 మండలాల్లో బుధవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అనకాపల్లిలో 16, తూర్పుగోదావరిలో 2, ఏలూరులో 2, గుంటూరులోని మూడు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు. కాకినాడలోని 10 మండలాల్లో, కృష్ణాలో 2, ఎన్టీఆర్‌లో 8, పల్నాడులో ఒక మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. పార్వతీపురంమన్యంలో 12 శ్రీకాకుళంలో 4, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 19, వైఎస్ఆర్లో 10 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం అనకాపల్లి 17, కాకినాడ 2, కృష్ణా 1, నంద్యాల 2, విశాఖ 2, విజయనగరం 2, వైఎస్ఆర్ 3 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచాయని అధికారులు తెలిపారు. 110 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయని హెచ్చరించారు.


‘‘రాష్ట్రంలో ఎండలు మరింత విపరీతం కానున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో విశాఖకి తూర్పుగా అధిక పీడన ప్రాంతం కొనసాగుతోంది. దీని వలన పొడిగాలుల తీవ్రత పెరిగి రానున్న మూడు రోజుల వ్యవధిలో మధ్య ఆంధ్రా ప్రాంతం అయిన ఎన్టీఆర్ (విజయవాడ వైపు), గుంటూరు, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం పశ్చిమ భాగాలు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య​, కడప​, కర్నూలు, నంధ్యాల, చిత్తూరు జిల్లాల్లో వేడి 44- 45 డిగ్రీల వరకు పలు భాగాల్లో నమోదవ్వనుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వేడి 40 వరకు ఉండనుంది. అలాగే కృష్ణా, కొనసీమ​, బాపట్ల​, కాకినాడ జిల్లాల్లో 36 నుంచి 39 డిగ్రీల మధ్యలోనే వేడి కొనసాగుతుంది. విశాఖ నగరంలో కూడా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు ఉండనుంది. వేడి తీవ్రత మరో మూడు రోజుల వరకు కొనసాగనుంది.


తెలంగాణలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు


నిన్న దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి ఉన్న ద్రోణి/గాలిలోని అనిచ్చితి, ఈ రోజు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రం మట్టానికి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు  41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 43 డిగ్రీల మధ్యన  కొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC మరియు చుట్టు ప్రక్కల జిల్లాలలో 40 డిగ్రీల  కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.  ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో)  వీచే అవకాశం ఉంది.



ఢిల్లీలో విపరీతమైన ఎండలు


సోమవారం (ఏప్రిల్ 17) వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని చాలా రాష్ట్రాలు వేడిగాలుల ఉచ్చులో ఉంటాయని అంచనా. IMD ప్రకారం, రాబోయే 4 రోజులు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, దేశంలోని వాయువ్య ప్రాంతంలో రెండు రోజుల పాటు వేడి గాలులు కొనసాగుతాయి.