ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు పీపీఏలతో కుదుర్చుకున్న ఒప్పందాలను తాము డబ్బులు చెల్లించలేమని చేతులెత్తేశాయి. ఏడాది సమయం ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి. తమ దగ్గర డబ్బుల్లేవని. తామకు విద్యుత్ సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోతున్నామని హైకోర్టుకు నివేదించారు. పీపీఏలకు ప్రభుత్వం దాదాపుగా రూ. 20వేల కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. 


ఆరు వారాల్లో చెల్లించాలని మార్చి 15న హైకోర్టు తీర్పు ! 


వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే సంప్రదాయేతర విద్యుత్ సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను రద్దు చేశారు. కానీ అవి కోర్టులో నిలబడలేదు. కేంద్రం హెచ్చరించినా పట్టించుకోలేదు. వాటి దగ్గర తీసుకున్న విద్యుత్‌కు బిల్లులు కూడా చెల్లించడం ఆపేశారు. పీపీఏల ప్రకారం విద్యుత్ తీసుకున్నా బిల్లులు ఇవ్వలేదు. దాంతో ఆ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. విచారణ తర్వాత బకాయిలు, భవిష్యత్తు ధరలు పీపీఏల్లో పేర్కొన్న ప్రకారమే చెల్లించాలని రాష్ట్రప్రభుత్వానికి, డిస్కంలకు హైకోర్టు తేల్చిచెప్పింది.  ప్రభుత్వం చేసుకున్న పీపీఏల ప్రకారం బిల్లులు చెల్లించాల్సిందేనని మార్చి పదిహేనో తేదీన హైకోర్టు తీర్పు చెప్పి ఆరు వారాల గడువు ఇచ్చింది. దీంతో అప్పటి వరకూ చెల్లించకుండా ఆపేసిన మొత్తం దాదాపుగా రూ . 20 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆరు వారాల పాటు ఎలాంటి చెల్లింపులు చేయని ప్రభుత్వం.. ఇప్పుడు తమ దగ్గర డబ్బుల్లేవని అందుకే చెల్లింపులు చేయలేకపోతున్నామని హైకోర్టుకు తెలిపింది. 


ఆర్థిక సంక్షోభంలో ఉన్నామన్న డిస్కంలు ! 


విద్యుత్ సంస్థలు పెద్ద ఎత్తున రుణాల ఊబిలో ఉన్నాయని .. ఆ సంస్థ ఆర్థిక కష్టాలను హైకోర్టు ముందు ఏకరువు పెడుతోంది ప్రభుత్వం.  పీపీఏలను సమీక్షించడం వల్ల అంతర్జాతీయంగానూ పెట్టుబడిదారుల్లో ఏపీపై నమ్మకం పోయిందని కేంద్రం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. దావోస్ వంటి చోట్ల పెట్టుబడుల సదస్సుల్లోనూ ఈ అంశం చర్చకు వచ్చింది.  విద్యుత్ సంస్థలకు పీపీఏల ప్రకారం చెల్లించడం విఫలమైతే.. తాను నేరుగా ఆర్బీఐ నుంచి రాష్ట్ర నిధులు చెల్లిస్తామని గతంలో కేంద్ర విద్యుత్ మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. 


పీపీఏలను సమీక్షించడంతోనే సమస్యలు ! 


పీపీఏల పునఃస‌మీక్షను కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసంది.  ఒప్పందాలను అలాగే కొనసాగించాలని, పునఃస‌మీక్ష పేరుతో స‌మ‌స్య‌లు సృష్టించవద్దని అందులో కోరారు.  పీపీఏల ర‌ద్దు ప్ర‌తిపాద‌న పెట్టుబ‌డుల‌కు తీవ్ర ఆటంకం అవుతుంద‌ని కేంద్రం ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నిర్ణ‌యం మార్చుకోవాల‌ని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క‌డుగు  ఏపీలో స‌రిపోయేంత విద్యుత్ ఉత్ప‌త్తి జ‌రుగుతోంద‌ని, అందుకే అధిక ధ‌ర‌ల‌కు విద్యుత్ కొనుగోలు చేస్తున్న ఒప్పందాల‌పై పునఃస‌మీక్ష అత్య‌వ‌స‌రమని ప్రభుత్వం వాదించింది. ఇప్పుడు అటు విద్యుత్ ఉత్పత్తి సరిపోకగా.. చివరికి పీపీఏలకు డబ్బులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. 


ఆరు వారాల్లో పీపీఏలకు డబ్బులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు హైకోర్టు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యుత్ శాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.