Srikakulam: తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. వివాదంలో రాజీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. మరోవైపు ఈ వ్యవహారంపై వైసీపీ అధినాయత్వం కూడా ఫోకస్ చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 


దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయితీకి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు కానీ ఆయన రాజకీయ జీవితానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడేలా ఉందంటున్నాయి వైసీపీ వర్గాలు. చాలా కాలంగా జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా పది రోజుల నుంచి రగులుతున్న వివాదాలపై వైసీపీ అధినాయకత్వం చాలా కోపంగా ఉందని వార్తలు వస్తున్నాయి. 


దువ్వాడ శ్రీనివాస్‌ శ్రీనివాస్ వ్యవహారంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఆయనపై భార్య బిడ్డలే పోరాటం చేయడం న్యాయం చేయాలంటూ రోడ్డు కెక్కడం పార్టీకి నష్టం కలిగిస్తుందని అంటున్నారని తెలుస్తోంది. వేరే స్త్రీతో కలిసి ఉంటానని భార్య బిడ్డలపై శ్రీనివాస్ చేసిన కామెంట్స్ అన్నీ పార్టీ అధిష్ఠానం నిశితంగా గమనిస్తోంది. అందుకే సరైన టైంలో దీనిపై కీలకమైన నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. 


విజయసాయిరెడ్డి విషయంలో పార్టీ సరిగా స్పందించలేదనే అపవాదు ఉండనే ఉంది. ఇప్పుడు దువ్వాడ వ్యవహారంలో కూడా చూసీచూడనట్టు ఉంటే కచ్చితంగా పెద్ద నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. అందుకే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ సభ్యత్వాన్ని రద్దు చేయాలని భావిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారని అనుకుంటున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే కీలకమైన నేతలతో చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. 


Also Read: అన్నా క్యాంటిన్‌లో రోజుకు ఒకరి ఫుడ్‌ తయారీకి అయ్యే ఖర్చు ఎంత? కీలక వివరాలు చెప్పిన చంద్రబాబు


ఇదే జరిగితే మాత్రం దువ్వాడ రాజకీయ జీవితానికి ఎండ కార్డు పడినట్టే అంటున్నారు జిల్లా నాయకులు. కాంగ్రెస్‌తో రాజకీయ ప్రయాణం ప్రారంభించి రాజశేఖర్‌ రెడ్డికి చేరువై... జగన్‌కు దగ్గరై కీలకమైన నేతగా ఎదిగారు దువ్వాడ శ్రీనివాస్. జగన్‌కు అండగా ఉంటూ ఎవరైనా ఆయన్ని విమర్శిస్తే విరుచుకుపడే ఇలాంటి నేత దూరం చేసుకోవడం వైసీపీకి కష్టమే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదని అంటున్నారు. మూడు దశాబ్దాల పాటు ఎంతో కష్టపడి..ఎన్నో బాధలను దిగమింగుతూ.. కష్టాలను దాటుకుంటూ.. ఒక్కో ఇటుకను పేర్చి..ఇంతింతై..ఎదిగిన శ్రీనివాస్..ఒక్క వివాదంతోనే తెరమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి. ఎవరూ ఊహించని విధంగా ఆయన భవిష్యత్తు ఇలా డైలమాలో పడింది. 


మరోవైపు శ్రీకాకుళం జిల్లా కాళింగుల్లో కీలకంగా ఎదిగిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. మొదట్లో తమ్మినేని సీతారామ్‌కు అధిక ప్రాధాన్యత ఉండేది. తర్వాత దువ్వాడ శ్రీనివాస్‌కి కూడా ఆస్థాయి ఇంపార్టెన్సీ లభించింది. ఇలా కీలకంగా ఎదుగుతున్న నేత గ్రాఫ్‌ సడెన్‌గా  పడిపోవడంతో ఆ సామాజిక వర్గంలో కూడా ఆందోళ వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో కీలకమైన నేతలుగా ఎదిగే క్రమంలో ఎలాంటి తప్పులు చేయకూడదో అనేందుకు దువ్వాడ శ్రీనివాస్ ఉదంత ఒక ఉదాహరణగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు 


Also Read: ఆర్కే రోజా, ధర్మానకు బిగుస్తున్న ఉచ్చు! విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు