తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేస్తోందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి అభినందించారు. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంతోపాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ఆసేతు హిమాచలం బద్రీనాథ్ క్షేత్రం నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేనివిధంగా తిరుమలలో ప్రతినిత్యం వేద ఘోష జరుగుతోందని చెప్పారు. ఇది మానవాళికి అత్యంత శ్రేయస్కరమన్నారు. విశాఖలోని రామకృష్ణ బీచ్ లో సోమవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహిక దీపారాధన చేశారు.
భక్తుల చెంతకు భగవంతుడు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వరుసగా మూడోసారి విశాఖలో కార్తీక మహాదీపోత్సవాన్ని టీటీడీ నిర్వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. భక్తుల చెంతకు భగవంతుడు అన్న నినాదంతో దేశవ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు, శ్రీనివాస కల్యాణాలు, కార్తీక దీపోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రంగా మారనున్న విశాఖ నగరానికి శ్రీవారి అనుగ్రహం ఉండాలన్న కోరికతో స్థానిక ప్రజలు టీటీడీని సంప్రదించడం, వారు అంగీకరించడం సంతోషకరమన్నారు. 
జ్యోతిర్లింగాలలో శ్రీశైలం మల్లన్న, వైష్ణవాలయాలలో ప్రపంచంలో మరెక్కడా లేని తిరుమల వెంకన్న గొప్ప క్షేత్రాలు మన రాష్ట్రం లోనే ఉన్నాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత రాష్ట్రానికి దక్కిన గొప్ప సంపద తిరుమల శ్రీవారి ఆలయమని చెప్పారు. సముద్రుడి సాక్షిగా మహిళల సౌభాగ్యం, దేశ సౌభాగ్యం కోసం టీటీడీ కార్తీకదీపోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. గత మూడు సంవత్సరాల్లో తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు పెరిగారని, పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరికీ ఎలాంటి లోటు లేకుండా టీటీడీ సదుపాయాలు కల్పిస్తూ భక్తుల సేవే భగవంతుని సేవగా అద్భుతమైన సేవలందిస్తోందని కొనియాడారు. శ్రీవారి ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత విశాఖకు అన్ని శుభాలే జరుగుతున్నాయన్నారు. సింహాచలం అప్పన్న తోపాటు తిరుమల శ్రీవారు విశాఖకు విచ్చేశారని, ఇక అందరికీ శుభం జరుగుతుందని ఆకాంక్షించారు.




టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విశాఖపట్నంలో సాగర తీరాన ఆహ్లాదకర వాతావరణంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో వరుసగా మూడోసారి కార్తీక మహాదీపోత్సవం నిర్వహించడం మనందరి అదృష్టమన్నారు. ధర్మప్రచారంలో భాగంగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఇటీవల శ్రీనివాస కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో జమ్ములో శ్రీవారి ఆలయానికి మహా సంప్రోక్షణ నిర్వహిస్తామని తెలియజేశారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా టీటీడీ ఒక వైపు పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు అత్యంత పారదర్శక పాలన అందిస్తోందన్నారు. ఇందులో భాగంగానే రెండు నెలల క్రితం టీటీడీ ఆస్తులకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. వారం  రోజుల క్రితం స్వామివారికి  వివిధ బ్యాంకుల్లో ఉన్న 15,938 కోట్ల నగదు, 10,258 కిలోల బంగారం డిపాజిట్లకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు. ఈ ఏడాది మార్చి 23వ తేదీన విశాఖ నగరంలో నూతన శ్రీవారి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించి దర్శనభాగ్యం కల్పిస్తున్నామని చెప్పారు.  




కార్తీక దీపోత్సవం ఇలా...
- విశాఖ సాగరతీరంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు శ్రీ ఫణియాజులు బృందం వేదస్వస్తి వినిపించారు. పండితులు డా.పివిఎన్ఎన్.మారుతి స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. వేదస్వస్తి అనంతరం డా. మారుతి దీప ప్రాశస్యాన్ని తెలియజేశారు. 
- అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన నిర్వహించారు.  పండితులు విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చేశారు. 
- ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు. 


ఆకట్టుకున్న నృత్య రూపకం 
- కార్యక్రమంలో ప్రదర్శించిన దీపలక్ష్మీ నమోస్తుతే  నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. దీపం ప్రాశస్యాన్ని  కళ్ళకు కట్టేలా కళాకారులు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. 
- దీప మంత్రం 9 సార్లు భక్తులతో పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. భక్తుల గోవిందనామ స్మరణతో విశాఖ సాగర తీరం మారుమోగింది. 
- చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
- టీటీడీ జెఈవో సదా భార్గవి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, శేషాచల దీక్షితులు,  మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, అదీప్ రాజు , ఎమ్మెల్సీ  వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున, టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబిసి  సీఈవో షణ్ముఖ కుమార్, మాజీ సీఈవో సురేష్ కుమార్, దాతలు రాజేష్, హిమాంశు ప్రసాద్, కృష్ణప్రసాద్ బృందం కార్యక్రమ నోడల్ ఆఫీసర్లు ఎస్ ఈ 2 జగదీశ్వర రెడ్డి, డిఈ రవిశంకర్ రెడ్డి, విజోవో మనోహర్, డిఎఫ్వో శ్రీనివాస్ పాల్గొన్నారు. 
- శ్రీవారి సేవకులు, శ్రీ హరి సేవా బృందం, అన్నమాచార్య సేవా బృందం సభ్యులు సేవలు అందించారు.