అల్లూరి జిల్లా: విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా వాటర్ ఫాల్స్ చూద్దామని వెళ్లిన వారిలో కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతయ్యారు. అల్లూరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.  


మారేడుమిల్లి మండలం జలతరంగణి వాటర్ ఫాల్స్ చూద్దామని ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన 13 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉధృతంగా రావడంతో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికులు శ్రమించి ఇద్దరు విద్యార్థుల్ని కాపాడారు. ముగ్గురు గల్లంతు కాగా, వారిలో ఓ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాగులో మొత్తం ఐదుగురు కొట్టుకుపోగా, వారిలో ఇద్దరు అమ్మాయిలు చింత హరిణి, దాడి పుష్ప అనే ఇద్దరిని స్థానికులు రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఓ అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి జీజీహెచ్ కు తరలించారు. 


గల్లంతైన ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి ఆచూకీ తెలియాల్సి ఉంది. గత ఈతగాళ్లతో కలిసి మారేడుమిల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీహెచ్. హరదీప్, కె. సౌమ్య, బి. అమృతల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. విహారయాత్రకు మొత్తం 13 మంది విద్యార్థులు వెళ్లగా, వారిలో 10 మంది అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు.