Visakha Railway Zone | ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరింది. విశాఖ రైల్వే అభివృద్ధికి చారిత్రాత్మక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా విశాఖ రైల్వే జోన్లో నాలుగు డివిజన్లు విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్ డివిజన్ ఉంటాయి. ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. వాల్తేరు రైల్వే డివిజన్ను కొనసాగిస్తూ, విశాఖపట్నం డివిజన్గా పేరు మార్చుతూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం చేయడంతో పాటు, రైల్వే ఉద్యోగుల్లో సందేశాలను తొలగించింది.
విశాఖ రైల్వే అభివృద్ధికి చారిత్రాత్మక ముందడుగు
132 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ను కొనసాగిస్తోంది కేంద్రం. వాల్తేరును "విశాఖపట్నం డివిజన్" గా పునర్ నామకరణం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ కేంద్రం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం విశాఖ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందన్నారు. ఈ 4 డివిజన్లతో విశాఖపట్నం రైల్వే మరింత బలోపేతం కానుంది. మెరుగైన మౌలిక వసతులు, రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ శ్రీభరత్ వివరించారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ – నాలుగు ప్రధాన డివిజన్లు ఇవే.. విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్ డివిజన్
విశాఖపట్నం రైల్వే అభివృద్ధికి కొత్త దిశ
విశాఖపట్నం డివిజన్ ఏర్పాటుతో రైల్వే మౌలిక వసతులు మరింత అభివృద్ధి చెందనున్నాయని శ్రీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మరింత మద్దతు వచ్చే అవకాశం ఉంది. దాంతో రానున్న రోజుల్లో విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్కు హబ్గా మారనుంది. రైల్వే ప్రాజెక్టుల వేగవంతమైన అమలు, కొత్త రైళ్ల ప్రవేశం, ఆధునికీకరణ ప్రణాళికలు, మెరుగైన ప్రయాణ అనుభవానికి ఇదొక కీలక పరిణామని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి, సీఎం చంద్రబాబు కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.