అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అనుకున్న సమయానికే మొదలు పెడతారని టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు. జనవరి 27వ తేదీన ఉదయం 11 గంటలకు కుప్పంలో లోకేష్  పాదయాత్ర మొదలవుతుందని స్పష్టం చేశారు. పాదయాత్ర కోసం తాము ముందే దరఖాస్తు చేసుకున్నా ఏపీ ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. 


మా టార్గెట్ లోకేష్ అని సీఎం జగన్ అన్నారు !
విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో బుద్ధా వెంకన్న శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మా టార్గెట్ లోకేష్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారని, అంటే యువగళం పాదయాత్ర చేపట్టనున్న లోకేష్ మీద దాడులు చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్రం జోక్యం చేసుకుని కేంద్ర బలగాలతో నారా లోకేష్ కు రక్షణ కల్పించాలని కోరారు. లోకేష్ పాదయాత్రపై ప్రజలు ఉత్సాహం చూపుతోంటే జీఓ నెంబర్ 1 తో అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. కానీ తాము బాధ్యతగా ముందుగానే నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి కోసం దరఖాస్తు చేశామని, జీఓ నెంబర్ 1 ని ఉపసంహరించుకుని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సంబంధిత పర్మిషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న కోరారు.  


ప్రతిపక్ష నేతల పాదయాత్రలను గతంలో ఏ పార్టీకి అనుమతులు నిలిపివేసిన దాఖలాలు లేవు అన్నారు. జీఓ నెంబర్ 1 పై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసినా, సుప్రీంకోర్టు కు వెళ్లి భంగపాటుకు గురయ్యారని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం అవుతుందనే భయంతో ఏపీ సీఎం జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇదివరకే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు జీవోలపై ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసిందని, అయినా వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిగా జీవోలు తీసుకొచ్చి అందర్నీ ఇబ్బందులకు గురిచేస్తోందని బుద్ధా వెంకన్న ఆరోపించారు.


లోకేష్ పాదయాత్రపై ఉత్కంఠ..
లోకేష్ పాదయాత్ర పై టీడీపీ నేతల్లో టెన్షన్ మెదలైంది. ఈనెల 27 నుంచి పాదయాత్రకు లోకేష్ రెడీ అవుతున్న తరుణంలో పోలీసులు అనుమతులు లభించలేదు .దీంతో ఆ పార్టి నేతలు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి రిమైండర్ పంపారు. యువగళం పాదయాత్ర కోసం అవసరం అయిన ముందస్తు అనుమతులు పై పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లభించలేదు. జనవరి 9వ తేదీన ఈ మెయిల్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లిఖిత పూర్వకంగా అనుమతులు కోసం లేఖ రాశారు. అంతే కాదు జనవరి పదో తేదీన లిఖిత పూర్వక లేఖ ను డీజీపీ కార్యాలయంలో కూడ సమర్పించారు. అయితే ఇందుకు సంబందించిన అనుమతులు పై టీడీపీ నేతలకు ఇంత వరకు ఎలాంటి రిప్లై రాలేదు. 


నారా లోకేశ్ పాదయాత్రకు ఇంకా అనుమతి ఇవ్వకపోవటతోం మిగిలిన అంశాలపై కూడా ఆ పార్టీ నేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర నిర్వహించేందుకు అవసరం అయిన అన్ని మార్గాలను  నేతలు అన్వేషిస్తున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వని పక్షంలో తీసుకోవాల్సిన చర్యలు పై  చర్చిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారని గుర్తుచేస్తున్నారు. అదే సందర్బంలో ఆయన చేసిన పాత వ్యాఖ్యల రికార్డులను టీడీపీ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. పాదయాత్రకు అనుమతులు అవసరం లేదంటూ గతంలో జగన్ చేసిన ప్రకటనను బయట పెడుతున్న టీడీపీ నేతలు, అనుమతులు విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.