ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు పంటలను నాశనం చేయడమే కాకుండా ప్రజలపై దాడి చేస్తూ ప్రాణాలను తీస్తున్నాయి. ఏనుగుల గుంపు గ్రామాల వైపు రాకుండా జిల్లాకు చెందిన 13 మంది ట్రాకర్లతో విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఏనుగులు గ్రామం వైపు రాకుండా చూసే క్రమంలో వాటి బారిన పడి గాయాల పాలవ్వడం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల భామిని మండలం పసుకుడిలో ఓ ట్రాకర్ పై ఏనుగులు దాడి చేసి తొక్కి చంపేశాయి. ఆ ట్రాకర్ పాతపట్నం మండలం తిమికి చెందిన ఆదినారాయణ అనే గిరిజనుడు. దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ గా తీసుకుంది. సుమోటోగా కేసు నమోదు చేయడమే గాకుండా ఉన్నతాధికారులతో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు ఈ వ్యవహరంపై జాతీయ గిరిజన కమిషన్ రిసెర్చ్ అధికారి అంకిత్ కుమార్ సేన్ పేరిట నోటీసు జారీ అయింది. 


అటవీ శాఖ ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ వై.మధుసూధన రెడ్డి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకార్కు తాజాగా నోటీసులు పంపారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల ట్రాకర్ మృతి చెందారన్న దానిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరడం ఇప్పుడు అధికారుల్లో చర్చనీయాంశం అయింది. అటు గిరిజనులు కూడా అధికారుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రక్షణగా ఉన్న ట్రాకర్ మృతి చెందితే కనీసం ఆ కుటుంబానికి తగిన గౌరవం ఇవ్వలేదంటూ ఆరోపిస్తున్నారు. దహన సంస్కారాల రోజు కూడా ఆ శాఖాధికారులు పెద్దగా పట్టించుకోలేదని ఆదివాసీ వికాస పరిషత్ ప్రతినిధి వాబ యోగి ఆరోపించారు. అదే ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇలానే చేసి ఉండేవారా అని ప్రశ్నిస్తున్నారు. ఏనుగుల దాడిలో మృతి చెందితే కేవలం రూ.5లక్షలు ఇచ్చి చేతులు దులుపు కోవడం తగదని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు ట్రాకర్లు చనిపోయారని, వారు కూడా గిరిజనులేనని తెలిపారు. వారి కుటుంబాలను కూడా పాలకులు పరామర్శించి ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. తక్షణమే ఆయా కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాగా రూ.50 లక్షలు ఇవ్వాలని, ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.


తివ్వకొండలో ఏనుగుల గుంపు చక్కర్లు..
భామిని మండలంలో పది ఏనుగులు ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా అయిన భామిని మండలంలో తిష్ట వేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. 2007లో వచ్చిన ఏనుగుల గుంపులో మిగిలిన నాలుగు ఏనుగులు పసుకుడి పరిసర ప్రాంతాల్లో ఉండగా, గత వారం ఒడిశా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మరో ఆరు ఏనుగులు తివ్వకొండల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏనుగుల వల్ల పక్కుడి బద్ర, నేరడి గ్రామానికి చెందిన రైతుల పంటనష్టాలను చవిచూశారు. గతంలో తిష్ట వేసిననాలుగు ఏనుగుల గుంపును ఒడిశాలోని లభేరీ అడవులకు తరలించాలని బాధిత రైతులు, గిరిపుత్రులు డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేవారు. ఇప్పటి వరకు ఈ ఏనుగులతో పాలకొండ డివిజన్లో 14మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 


ఇక పంట నష్టాలైతే కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. వన్యప్రాణ రక్షణ చట్టం మేరకు అటవీశాఖాధికారులు ఏనుగులకు రక్షణ కల్పిస్తునే రైతుల పంటలు నష్టపోకుండా చూడాల్సివున్నా అటువంటి చర్యలేవీ చేపట్టడం లేదు. వాటిని ఒడిశా లభేరి అడువులకు లేకుంటే జూకైన తరలించాలని రైతులు, గిరిజనులు కోరుతున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించేలా చూడాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల భామిని మండలం తాలాడ గ్రామంలో ఏనుగుల దాడి వల్ల గోరుచిట్టె చిన్నారావు మృతి చెందాడు. ఆ కుటుంబానికి పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. అయితే చనిపోయిన చిన్నారావు కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేస్తోంది. ఏనుగులను తరలించాలని మంత్రులకు, ఫారెస్టు అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేదని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్లక్ష్య ధోరణి విడనాడి ఏనుగులను తరలించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబాలకు ఒక ఉద్యోగం, ఎక్స్ గ్రేషియా, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రు.30వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.


మృతుడి కుటుంబానికి అరకోటి ఇవ్వాలి
పాతపట్నం మండలం తడిమి గ్రామానికి చెందిన ఆదినారాయణ అనే ట్రాకర్ పసుకుడిలో ఏనుగుల దాడితో మృతి చెందాడు. గజరాజులను రక్షించడంతోపాటు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ట్రాకర్ గా విధులు నిర్వహిస్తుండగా అవి తొక్కేయడంతో ప్రాణాలు విడిచాడు. ఆదినారాయణ అంత్యక్రియలు గౌరవ ప్రదంగా నిర్వహించలేదు. ట్రాకర్గా విధులు నిర్వహి స్తున్న వారిలో అధిక మంది గిరిజనులే ఉన్నారు. పాల కులు వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పసుకుడిలో బాధితుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించడంతో పాటు ఉద్యోగం ఇవ్వాలి. రెండు ఎకరాల భూమి మంజూరు చేయాలి. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నవారికి ముందస్తుగా ప్రభుత్వమే బీమా చెల్లించాలి. పసుకుడి వ్యవహారంపై ఎస్టీ జాతీయ కమిషన్ కూడా సుమోటోగా కేసు నమోదు చేయడం కొండంత ధైర్యం కలిగించింది.


View Pdf