Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిపై ఉన్న బ్రిడ్జి ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా విరిగి పడింది. ఉదయం 70 టన్నుల బరువున్న రాళ్ల లారీ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపైన వెళ్తున్న వాహనాలన్నీ కింద పడిపోయాయి. అయితే వంతెన కుప్పకూలిన ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 1929లో దీనిని నిర్మించారు. ఇచ్ఛాపురం పట్టణం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవటంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదు.