Srikakulam Latest News: మాదకద్రవ్యాల వైపు యువత వెళ్లకుండా ఎన్ని చర్యలు చేపట్టినా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు మార్కెట్లో సరఫరా కావడం ఆశ్చ ర్యంగా ఉందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మంగళవారం పొట్టిశ్రీరాములు మార్కెట్‌ పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు యువకులను పట్టుకున్నారు. ఆరా తీస్తే గంజాయి సేవించినట్టు తేలింది. దీంతో ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


గంజాయి సేవిస్తున్న ఇద్దరిని ఎమ్మెల్యే గొండు శంకర్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఇద్దరు యువకులు గంజాయి సేవిస్తూ ఎమ్మెల్యేకు చిక్కారు. పొట్టిశ్రీరాములు పెద్ద మార్కెట్‌లో మంగళవారం పర్యటించిన ఎమ్మెల్యే అధికారులతో కలిసి నిరుపయోగంగా ఉన్న మార్కెట్‌ భవనాలు పరిశీలించారు. ఆ టైంలోనే అనుమానాస్పదంగా ఉన్న దమ్మలవీధికి చెందిన ఇద్దర్ని ఎమ్మెల్యే గుర్తించారు. వారిని ఎమ్మెల్యే శంకర్‌, ఆయన సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించారు. తనిఖీలు చేశారు. విచారణ చేస్తే వారు గంజాయి సేవిస్తున్నట్టు బయటపడింది. పోలీసులకు ఫోన్‌ చేసి ఇద్దరు యువకులను అప్పగించారు. 


Srikakulam Latest News: శ్రీకాకుళంలో గంజాయి తాగుతూ ఎమ్మెల్యేకే చిక్కిన కాలేజీ విద్యార్థులు, తర్వాత ఏమైందంటే?


పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారి నుంచి గంజాయిని, సేవించడానికి వినియోగిస్తున్న బాటిల్‌, గంజాయి దట్టించిన గొట్టం, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. గంజాయి ఎక్కడ నుంచి తీసుకువచ్చారు తదితర వివరాలపై ఆరా తీస్తున్నారు. 


గంజాయి సేవిస్తున్న యువకులను పట్టుకున్నట్టు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో రాకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని పెద్దమార్కెట్‌లో నిరుపయోగంగా ఉన్న భవనాలపైన అసాంఘిక కార్యాకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయని చెప్పడానికి అక్కడ ఖాళీ మద్యం సీసాలే నిదర్శనమని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. రోజుకు 16 గంటలు రద్దీగా ఉండే పెద్దమార్కెట్‌లో గంజాయి సేవించడానికి యువకులు అడ్డాగా మార్చుకున్నారనడానికి ఈ వ్యవహారమే నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


గంజాయి విక్రయించేవారిపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు ఎమ్మెల్యే. మాదకద్రవ్యాల, గంజాయి వంటి మత్తు పదార్థాలు మార్కెట్లో సరఫరా కావడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మాదకద్రవ్యాలను నియంత్రించడానికి పోలీసు వ్యవస్థ గట్టి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. నగరంలోని యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సంకల్పం పేరుతో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. యువతలో ఇంకా మార్పు రావట్లేదని విచారం వ్యక్తం చేశారు. 



ప్రజలు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఎమ్మెల్యే. అనంతరం మార్కెట్‌ను పరిశీలించి పెద్దమార్కెట్‌ స్వరూపాన్ని మార్చేందుకు కృషి చేస్తానన్నారు. అవసరమైతే అసెంబ్లీలో మార్కెట్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుతో చర్చించి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని వ్యాపారులు హమీ ఇచ్చారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌లో పారిశుధ్యం పూర్తిస్థాయిలో మెరుగుగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశించారు.


Also Read: "పైలట్‌ రామ్‌"- 'యశస్' యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి


యువత చెడిపోవడానికి గల కారణాలు
ప్రధానంగా యువత చెడిపోవడానికి తల్లిదండ్రులేనని వారి సరైన మార్గంలో పెట్టాలని సూచించారు. కాలేజ్‌కు వెళ్లవలసిన యువకులు గంజాయి సేవిస్తూ దొరకడంపై ఒక్కసారిగా నగరంలో కలకలం రేగింది. కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టేలా చేయాలన్నారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు జరిమానా విధిస్తే మార్పు వస్తుందని అన్నారు. 



Also Read: సీఎం రమేష్ టీడీపీ తరపున మాట్లాడుతున్నాడు - లోక్‌సభలో వైసీపీ ఎంపీ ఆరోపణ - అసలేం జరిగిందంటే?