Poosapati Ashok Gajapathi Raju: విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు ఆగర్భ శ్రీమంతుడు, సంస్థానాదీశుడు. కేంద్ర విమానయాన మంత్రిగా కూడా పనిచేసిన ఆయన.. ఇలా సింపుల్‌గా హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై కూర్చుని కనిపించారు. ఫ్యామిలీతో కలిసి తబోడా వెళుతున్న ఆయన రైలు కోసం ఇలా సామాన్యుడిలా ఎదురుచూస్తున్నారు. రాజుగారి సింప్లిసిటీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నరు. ఆయన తలచుకుంటే ప్రత్యేక విమానంలో వెళ్లగలిగేంత సంపన్నులు. అయినప్పటికీ సామాన్య ప్రజలతో ఇలా రైలు కోసం వేచి చూశారు. అశోక్ గజపతి రాజు స్వభావ రీత్యా కూడా చాలా సామాన్య వ్యక్తి. గతంలోనూ ఆయన అనుసరించిన జీవనశైలి, విధానాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


డబ్బుకు విలువుండొచ్చు.. కానీ “డబ్బుతో” విలువ రాదు.. ఆ విషయాన్ని నిరూపించిన అతికొద్ది మందిలో పూసపాటి అశోక్ గజపతిరాజు ఒకరు. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చిన్న మరక కూడా లేకుండా.. స్వచ్ఛ పాలిటిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన్ను ఎవరూ వేలెత్తి చూపింది లేదు పల్లెత్తు మాట అన్నది లేదు.


1945లోనే సొంత విమానం


రాజకీయ నాయకుడు కాకముందే ఆయన రాజు. దేశంలోని ప్రముఖ సంస్థానాల్లో ఒకటైన విజయనగర సంస్థాన వారసుడు. కోటలని.. కోట్లని కాదనుకుని, భూములను బంగళాలను వదులుకున్న అసామాన్యుడు! ఎలైట్ సర్కిల్ లో పెరిగినా.. విజయనగరం వీధుల్లోనే తిరిగిన సామాన్యుడు! గ్వాలియర్ రాజసంస్థానాల్లో చదువుకున్నాడు. పెద్ద పెద్ద పట్టాలు లేకపోవచ్చు.. కానీ ఆయన డిగ్నిటీ ముందు అవన్నీ దిగదుడుపు..! కార్పోరేటర్ గా ఉంటేనే కళ్లు నెత్తికెక్కినట్లు బిహేవ్ చేస్తున్న రోజులివి..! ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. కేంద్రమంత్రిగా ఉన్నా ఆయన ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. విమానాల శాఖ మంత్రిగా పని చేసిన అశోక్ ఫ్యామిలీకి.. 1945లోనే సొంత విమానం ఉండేది. కలకత్తా నుంచి చెన్నై వరకు మొత్తం ఈస్ట్ కోస్ట్ లో ఎక్కడా బీఎస్సీ కాలేజ్ లేదు.. అశోక్ తండ్రి పీవీజీ రాజు వందేళ్లకు మునుపే.. విజయనగరం “మహారాజ” కాలేజ్ లో బీఎస్సీ కోర్సు పెట్టించారు.


దాదాపు 2 లక్షల ఎకరాలు విద్యా సంస్థలు, దేవాలయాలకు ఇచ్చిన కుటుంబం అది..! తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కు గానీ ఎస్పీ ఆఫీసుకుగానీ ఫోన్ చేసి ఈ కేస్ లో ఉన్నది మా వాళ్లే.. వదిలేయండి అని గాని.. ఫలానా వాళ్ల మీద కేసు పెట్టండి అని ఆయన చెప్పిన దాఖలా లేదు. ఎమ్మెర్వో నుంచి కలెక్టర్ వరకు ఎవరికీ ఫోన్ చేసి ఔట్ ఆఫ్ ద వే పని చేయమని ఒకసారి కూడా అడగలేదు.


నానో కారులో ప్రయాణం
పనులు చేసిపెడితేనే “మనవాడు” అనుకునే రాజకీయంలో జనం ఆయన్ను ఓసారి ఓడించారు. చివరకు జనమే తప్పు తెలుసుకున్నారు తప్పితే రాజు తన వైఖరి తప్పలేదు. గల్లీ లీడర్లు కూడా ఫార్చునర్లూ.. ఎండీవర్లు వాడుతుంటే.. ఆగర్భ శ్రీమంతుడైన ఆయన.. “నానో” కారులో తిరిగేవారు ముందూ వెనుక పైలట్లు కూడా అవసరం లేదు.. సీటు బెల్టు పెట్టుకుని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటారు. వ్యక్తిస్వామ్యం ఎక్కువగా ఉండే ప్రాంతీయ పార్టీలో ఉన్నా కూడా ఆయన “విలువ” ఏ మాత్రం తగ్గలేదు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు రాష్ట్రం అంతా “ఆదేశిస్తారు..” కానీ విజయనగరంలో “పాటిస్తారు”. కొన్ని సందర్బాల్లో పార్టీ స్థానిక నాయకత్వం ఎక్కడన్నా అభ్యంతరం చెప్పినా “అశోక్ చెప్పినట్లు” చేయండంటారు. పార్టీ అధినేతకు ఆయనంటే అంత గౌరవం! రిజల్ట్స్ వచ్చిన వెంటనే కేంద్రమంత్రిగా ఆయన్ను ప్రకటించగానే.. అంతా సైలెంట్..! రాజకీయాలకు సంబంధించి ఆయన రోల్ మోడల్.. ఎంపీ నిధులతో అంతా రోడ్డేసుకుని.. బిల్డింగులు కట్టిస్తే.. ఈయన స్కూలు పిల్లలకు బెంచీలు చేయింతారు. వారికి KINDLE ఈ- బుక్ రీడర్లు కొనిపించి పుస్తకాలు చదవమన్నారు. ఎవరో చిన్నారి ఆయన గొప్పతనం గురించి చెబుతుంటే విని పసిపిల్లాడిలా ఏడ్చేశారు.


గంటకు పైగా ఎండలోనే
అశోక్ తన కారును తానే స్వయంగా కడుక్కుంటారు. ఓసారి ఆయన కారు కడుక్కుంటే చూసిన గన్ మెన్.. అదేంటి సార్ మీరు చేస్తున్నారు.. మేమున్నామంటూ వస్తే “మీ డ్యూటీ మీరు చేయండ”ని పంపేశారు.. కేంద్ర కేబినెట్ మంత్రి అయినా ఆయనలో ఏ మార్పూ లేదు. పోయినవారం విజయనగరంలో తమ దివానంలో మేనేజర్ గా పనిచేసే ఆయన షష్టి పూర్తికి వెళ్ళారు. ఆయన షష్ఠి పూర్తికి అశోక్ దంపతులు, కూతురు వచ్చారు. పార్టీ లీడర్లే కాదు కనీసం అనుచరులు కూడా లేకుండా వాళ్లే వచ్చారు. వాళ్ళది రెండు అంతస్తుల ఇరుకు ఇల్లు. మేడ మీద వరండాలో హోమం చేశారు. హోమం పూర్తయ్యే వరకూ వరండాలోనే ఎండలో గంటకు పైగా ఉన్నారు. హోమం తరువాత మరో గంటసేపు చిన్న గదిలో ఉన్నారు. షష్ఠి పూర్తి దంపతులకు మంగళ స్నానాలు చేయిస్తారు. అశోక్ దంపతులు మొదట గా వారి మీద నీళ్లు పోసి. అప్పుడు వెళ్లారు. మాములు ఎమ్మెల్యే కూడా. తాను వస్తే ఘనంగా స్వాగతం చెప్పాలి ఎంతో గౌరవించాలి అనుకుంటాడు. కానీ అశోక్ తన ఉద్యోగి షష్ఠి పూర్తికి మాములుగా వచ్చి రెండు గంటలున్నాడు. అదీ అశోక్..!


ఉద్యోగులను గౌరవించడమే కాదు.. రూల్స్ తప్పితే అంతే కఠినం..!


అశోక్ కూతురు చిన్నప్పుడు 6 వ తరగతి కోసం విశాఖ వ్యాలీ స్కూల్ కి అప్లై చేశారు. అప్పుడు ఆయన రాష్ట్ర మంత్రి గా ఉన్నారు. కానీ వాళ్ళ అమ్మాయికి మెరిట్ లిస్టులో సీట్ రాలేదు. ఆ స్కూల్ కమిటీ కి విశాఖ కలెక్టర్ చైర్మన్. అశోక్ ఆఫీసియల్ పీఏ కలెక్టర్ కి ఫోన్లో విషయం చెప్పాడు. ఆ విషయం అశోక్ కి కూడా చెప్పలేదు. ఇలాంటి చిన్న విషయం చెప్పేది ఏముంది.. వాళ్ళ అమ్మాయి కి సీట్ కోసమే కదా అనుకున్నాడు. కలెక్టర్ ఆ అమ్మాయికి సీట్ ఇచ్చాడు. ఓ వారం తరువాత అశోక్ ఎదో మీటింగ్ కొసం విశాఖ వెళ్లారు. అప్పడు కలెక్టర్ ఆయన దగ్గరకు వచ్చి ‘ సార్, మీ అమ్మాయికి సీట్ ఇచ్చాము. ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నేను పర్సనల్ గా కేర్ తీసుకుంటాను.’ అని చెప్పి.. అశోక్ దగ్గర మార్కులు కొట్టేద్దామని అనుకున్నాడు. దాంతో అశోక్ కు అసలు విషయం తెలిసింది. అక్కడే తన పీఏ ను పిలిచారు. ‘ మీరు మీ పేరెంట్ డిపార్టుమెంట్ కు వెళ్లిపొండి’ అని చెప్పేశారు. తరువాత విజయనగరం కలెక్టర్ కు చెప్పి ఆయన్ని రిలీవ్ చేసేసి కొత్త పీఏ ను పెట్టుకున్నారు.


కుమార్తె విషయంలోనూ అంతే
అశోక్ స్టేట్ లో మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన కూతురుకు మెడిసిన్ సీట్ వచ్చింది. ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చింది. దాంతో నిజామాబాద్ లో మరిదో తెలంగాణా జిల్లా కాలేజ్ లో సీట్ వచ్చింది. దాంతో ఆ అమ్మాయి రోజు తమ కార్ లో హైదరాబాద్ బస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసి బస్సులో కాలేజ్ కి వెళ్ళేది. ఈ విషయం తెలిసి సీఎం పేషీ అధికారులు ఆ అమ్మాయిని సెకండ్ ఇయర్ లో హైదరాబాద్ ఉస్మానియా/గాంధీ మెడికల్ కాలేజ్ కు స్లయిడింగ్ లో తెచ్చేద్దాము అనుకున్నారు. అందుకు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే చాలు. అదే విషయాన్ని చంద్రబాబు కు చెప్పారు. అశోక్ అందుకు ఒప్పుకోరు అని బాబు అన్నాడు. అయిన మీరు ట్రై చేయండి అని చెప్పాడు. దాంతో సీఎం పేషీ సెక్రటరీ అశోక్ తో మాట్లాడారు. దానికి ఆశోక్ స్పందిస్తూ ‘హైదరాబాద్ కాలేజ్ లో చదవాలి అంటే మా అమ్మాయి ఇంకా మంచి ర్యాంక్ తీసుకోవాల్సింది. తెచ్చుకోలేదు. కాబట్టి అక్కడే చదవాలి. అంతే’ అని అనేశారు. 


ఎయిర్ పోర్టు సెక్యురిటీకి షాక్
విమానంలోకి లైటర్ తో వస్తే నన్ను పట్టుకోలేదేంటి అని విమానాశ్రయ సెక్యూరిటీకి షాక్ ఇచ్చారు.. దాదాపు దివాళాలో ఉన్న ఏవియేషన్ ను దారికి తెచ్చారు. తన సొంత ఊరిలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్నా.. రూల్స్ కు విరుద్దంగా ఒక్క పనీ చేయలేదు. ఔట్ ఆఫ్ ది వే ఆయన డిక్షనరీలోనే లేదు. కేంద్రం నిధుల విషయంలో మనం సరిగ్గా ఒత్తిడి తేలేకపోతున్నామని ఓసారి చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ లో క్యాజువల్ గా అంటే.. “నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నా అని భావిస్తే.. ఇప్పుడే కేబినెట్ కు రిజైన్ చేస్తా” అన్న నిఖార్సైన మనిషి అశోక్ గజపతిరాజు.


అందుకే మళ్లీ చెప్పడం..
నిజాయితీ ఉన్నోళ్లు చాలా మంది ఉండొచ్చు.. కానీ బంధుప్రీతి.. కులాభిమానం.. పక్షపాతం.. మొహమాటం ఇవేమీ లేని నేత “అతనొక్కడే..”