Vizag Cruise Ship: విశాఖపట్నం టూరిజంలో మరో కొత్త ఎట్రాక్షన్ చేరింది. నగరవాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న భారీ క్రూయిజ్ సేవలు ప్రారంభమయ్యాయి. 11 అంతస్తుల  భారీ క్రూయిజ్ షిప్ ఎంప్రెస్ వైజాగ్‌కు వచ్చింది. ఇవాళ మొదటి ప్రయాణం ప్రారంభమైంది. దీనిలో 1800 మందికిపైగా టూరిస్టులు ప్రయాణం చెయ్యొచ్చు. 


ఈ ఉదయం(జూన్ 8) ఉదయం 7 గంటలకు వైజాగ్ చేరిందీ షిప్‌. కాసేపటి క్రితం తిరిగి ప్రయాణమైంది కూడాను. ఒకరోజు ప్రయాణం తరువాత జూన్ 10 న ఉదయం పుదుచ్చేరి చేరుకుంటుంది. ప్రయాణికులకు అక్కడి పర్యాటక ప్రదేశాలు చూపించాక ఆ రాత్రి 8 గంటలకు బయలుదేరి 10వ తేదీ ఉదయం చెన్నై చేరుకోనుంది ఈ భారీ క్రూయిజ్.


గతంలో అండమాన్ నుంచి రెండు మూడు నెలలకోసారి వచ్చే షిప్‌ మాత్రమే వైజాగ్‌కు వచ్చేది. ఇప్పుడు చైన్నైకి డైరెక్ట్ క్రూయిజ్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని నడుపుతున్న జేయం భక్షీ అనే సంస్థకు వైజాగ్ పోర్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడంతో టూర్‌ మొదలైంది. 


క్రూయిజ్ షిప్‌లో ప్రయాణం ఓ మరపురాని జ్ఞాపకం :


క్రూయిజ్ షిప్పులను సముద్రంలో తేలియాడే సిటీగా చెప్పొచ్చు. క్రూయిజ్ షిప్పులో స్విమ్మింగ్ పూల్స్, కేసినోలు, ఫిట్‌నెస్ సెంటర్లు, సినిమా థియేటర్, బార్లు, సెలూన్లు, లైవ్ ఎంటర్టైన్‌మెంట్ షోలు, అడ్వెంచరస్ స్పోర్ట్స్, రెస్టారెంట్స్ ఇలా ఒకటేమిటి.. ఒక్క ప్రయాణంలోనే ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేసే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెలలోనే 15, 22 తేదీల్లో ఈ భారీ టూరిస్ట్ షిప్ వైజాగ్ నుంచి బయలుదేరనుంది. 


వివిధ ధరల్లో రూంలు


ఈ షిప్‌లో స్టే రూమ్ ధర సుమారు రూ. 25000, సముద్రాన్ని వీక్షించే సౌకర్యం ఉన్న రూమ్ ధర రూ.30000. మినీ సూట్ రూ.53,700గా ఉంది. పిల్లలకు మాత్రం ఈ రూమ్ రేట్ రూ.8732గా ఉంది. ఈ షిప్పులో మొత్తం అన్ని రూములు కలిపి 796 ఉన్నట్టు పోర్ట్ అధికారులు చెబుతున్నారు.


వైజాగ్ నుంచి విదేశాలకు షిప్‌లు


ప్రస్తుతం వైజాగ్ పోర్టులో ఇలాంటి భారీ క్రూయిజ్ షిప్పులు ఆగడానికి వీలుగా ఒక క్రూయిజ్ టెర్మినల్ రూ. 98 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది కల్లా ఈ టెర్మినల్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి అది రెడీ అయిందంటే గోవా, ముంబై, శ్రీలంకలతోపాటు ఇతర దేశాలకు చెందిన భారీ క్రూయిజ్ షిప్పులు కూడా వైజాగ్‌కు వచ్చే వీలుంది. 


వైజాగ్ టూరిజం డెవలప్మెంట్ మరింత వేగం  


మొత్తమ్మీద విశాఖతోపాటు ఏపీ వాసులు ఎదురుచూస్తున్న క్రూయిజ్ టూర్ అనుభూతి అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల వైజాగ్ టూరిజం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని అధికారులు భావిస్తున్నారు.