Vizag Largest Ship: భారత దేశంలోని 13 ప్రధాన ఓడరేవుల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక అతి పెద్ద ఓడరేవు విశాఖ పట్నం ఓడరేవు. విశాఖపట్నం ఓడరేవుకు తనదైన ప్రాధాన్యత ఉంది.  ఇది భారతదేశం మూడవ అతి పెద్ద ప్రభుత్వ యాజమాన్య నౌకాశ్రయం. పరిణామంలో తూర్పు తీరంలో కొలువైన అతి పెద్ద ఓడరేవు గా ప్రసిద్ధి చెందింది. విశాఖలో మొదటగా చెప్పుకునే పేరులో విశాఖ పోర్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు భారీ నౌకలు ఈ విశాఖ పోర్టుకు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఈ ఓడ రేవుకు ఉంది.  సరుకు రవాణాలో అనేక రికార్డులను సృష్టిస్తూ తన రికార్డులను తానే తిరగరాస్తూ ఖ్యాతిని చాటుకుంటుంది. ఇక తాజాగా విశాఖపట్నం ఓడరేవు అందరి దృష్టిని ఆకర్షించింది.


విశాఖకు అతి పెద్ద నౌక
విశాఖపట్నం  ఓడరేవుకు  అతిపెద్ద నౌక వచ్చింది. ఈ న్యూ కాసిల్ మాక్స్ లైన్ స్ధాయి నౌక, ఎంవీ హహైన్ నౌక గురువారం విశాఖపట్నం పోర్టుకు వచ్చింది. ఈ భారీ నౌకను జనరల్ కార్గో బెర్త్ లో లంగర్ వేశారు. ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌకలలో ఇదే అత్యంత పెద్దదని విశాఖ పోర్టు అధికారులు తెలిపారు. ఈ సరకు రవాణా నౌక 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్‌ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది.  బోత్రా షిప్పింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సంస్థ నౌక, సరకు నిర్వహణ ఏజెంట్‌గా సేవలందిస్తోంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి 1,99,900 టన్నుల మాంగనీస్ తో చేరుకోగా విశాఖ పోర్టులో 1,24,500 టన్నులు అన్లోడ్ చేశారు. ఈ సరుకును ప్రపంచంలోనే మాంగనీస్ ఎగుమతికి పేర్గాంచిన ప్రముఖ మాంగనీస్ ఎగుమతిదారుడు ఎరామెట్ ఎస్.ఎ. ఫ్రాన్స్ రవాణా చేశారు. షిప్ మరో రెండు రోజులపాటు ఇక్కడే ఉండనుంది.


టాప్ 20లో విశాఖ పోర్టు
ఈ షిప్‌మెంట్‌ విశాఖ పోర్టు, బోత్రా షిప్పింగ్‌ సర్వీసెస్‌కు ఓ మైలురాయిగా నిలిచిందని పోర్టు ఛైర్మన్ అంగముత్తు పేర్కొన్నారు. విశాఖ పోర్టును బల్క్‌ కార్గో ట్రాన్షిప్‌మెంట్‌ హబ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) ఇటువంటి మైలు రాళ్లను చేరుకోవడానికి మరింత కృషి చేస్తోందన్నారు. భవిష్యత్తులో బల్క్ కార్గో ట్రాన్స్‌షిప్‌మెంట్‌కు విశాఖపట్నం ఓడరేవును హబ్‌గా మార్చాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.  మరోవైపు విశాఖ పోర్టు అథారిటీకి ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ బ్యాంకు రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరు సూచికలో టాప్ 20లో స్థానం సంపాదించుకుంది. సీపీపీఐ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటైనర్ పోర్ట్‌ల పనితీరును పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ విజయాన్ని ప్రభుత్వంతో పాటు వాటాదారులు, రైల్వేలు, కస్టమ్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అభినందించాయి. ఈ ఘనత సాధించడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు అభినందించారు. అంతేకాదు 2023-24 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు కార్గో రవాణాలో మెరుగైన పనితీరు కనబరిచి దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.