విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కోసం తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా పోలీసులు భగ్నం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. త్రీటౌన్ సీఐ 20 మంది పోలీసులతో వచ్చి తన కాలు విరగ్గొ్ట్టారని అన్నారు. డాక్టర్లు పరీక్షలు చేసి తన ఆరోగ్యం బాగానే ఉందని అన్నారని చెప్పారు. ఆసుపత్రిలో నిన్న తనకు సైనైడో, లేదా మత్తుమందో ఇవ్వాలని చూశారని ఆరోపించారు. 


ప్రధాని మోదీ లేదా అదానీ నేరుగా జగన్ కాల్ చేసి దీక్షను భగ్నం చేయించారని కేఏ పాల్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అదానీ తొత్తు కాదని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంను ‘ఒరేయ్ జగన్’ అని అనిపించుకోవద్దని కేఏ పాల్ సూచించారు. ‘‘నన్ను ఎన్ కౌంటర్ చేయిస్తారట. నన్ను ఎత్తుకెళ్లడానికి హక్కు ఎక్కడుంది? నాపై దాడికి పాల్పడ్డ సీఐ రామారావు, ఎస్సైని సస్పెండ్ చేయండి. లేదూ అంటే 24 గంటల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.


నాతో పెట్టుకున్న ఏడుగురు పైకి పోయారు - పాల్


‘‘మీ నాన్నకు నాకు అయిన గొడవలో ఎవరు గెలిచారో నీకు తెలుసు. ఇప్పుడు మోదీకి, నాకు జరుగుతున్న గొడవలో ఎవరు గెలుస్తారో మీకు తెలుసు. సోనియా గాంధీ నా పీస్ మిషన్‌ని క్యాన్సల్ చేసేసింది. తర్వాత కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నాతో పెట్టుకుంటే ప్రాణాలైనా పోగొట్టుకుంటారు. లేదా అధికారమైనా పోగొట్టుకుంటారు. దేవుడి ఉగ్రతకు గురవుతారు. పవన్ కల్యాణ్ మాట్లాడితే పొలిటికల్ స్పీచ్, నేను మాట్లాడితే అవి దైవ శాపాలు. గతంలో ఏడుగురిలో ఏడుగురు పైకి పోయారు. 


దద్దమ్మల్లారా రాజీనామా చేయండి - కేఏ పాల్


మీరు ఆదానీ తొత్తు కాకపోతే వచ్చే నెల 5 లోపు స్టీల్ ప్లాంటు అధికారులతో సమావేశం కండి. లేదంటే వారితో కలిసి నేను కూడా మీ ఇంటి ముందే దీక్ష చేస్తాను. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తాను‌. పులివెందుల్లో కూడా జగన్ గెలవకుండా చేయగలను. ఏపీ ఎంపీలు రాజీనామా చేయాలి. దద్దమ్మల్లారా! అలాచేస్తే 30 రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను ఆపిస్తాను. మోదీ, అమిత్ షాతో అధికారిక ప్రకటన చేయిస్తాను. అలా చేయించకపోతే నేను ఇండియాలో ఇకపై అడుగుపెట్టను. ప్రజాశాంతి పార్టీ తరపున పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇస్తున్నాను. నాతో కలిసి పోటీ చెయ్యి పవన్, ప్యాకేజీలపై ఆశపడొద్దు. నేను విశాఖ ఎంపీగా పోటీ చేస్తాను. నేను స్ధానికుడిని, నాకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఓట్లే 2 లక్షల వరకూ వస్తాయి’’ అని కేఏ పాల్ చెప్పారు.


29న దీక్షా భగ్నం


సోమవారం (ఆగస్టు 4) సాయంత్రం కేఏ పాల్‌ విశాఖపట్నంలోని తన సొంత సొంత ఫంక్షన్‌ హాలులో దీక్ష చేపట్టారు. తర్వాతి రోజు మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్‌కు పాల్ ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకొని.. ఆరోగ్యం రీత్యా దీక్ష విరమించాలని కోరితే ఆయన ఒప్పుకోలేదు. దీంతో బలవంతంగా ఆయన్ను వాహనంలో ఎక్కించి సాయంత్రం 4 గంటల సమయంలో పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. అయితే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయేందుకు పాల్‌ విశ్వ ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. చివరికి అక్కడి నుంచి తప్పించుకొని తిరిగి ఆసిల్‌మెట్టలో దీక్ష శిబిరం ఏర్పాటుచేసిన ఫంక్షన్‌ హాలుకు చేరుకున్నారు.