Pawan Kalyan Latest News : జనసేన పార్టీ సైద్ధాంతిక భావజాలం కలిగిన పార్టీ అని ఆ భావజాలాన్ని నమ్మిన బలమైన సమూహం కలిగిన పార్టీగా పవన్ అభివర్ణించారు. జనసేన కులం పార్టీ కాదు... కుటుంబ పార్టీ కాదు అని స్పష్టం చేశారు. ప్రజల ఆశలను ముందుకు తీసుకెళ్లే, బలమైన ఆశయాలు కలిగిన ప్రాంతీయ పార్టీగా చెప్పుకొచ్చారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని జనసేన అధ్యక్షుడు పేర్కొన్నారు.
పవన్ ఇంకా ఏమన్నారంటే...“అక్రమ మైనింగ్, ప్రకృతి విధ్వంసం, అవినీతి అనేది వైసీపీ విధానాలు అయితే, ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం, రోడ్లు బాగుపడాలి అని గుడ్ మార్నింగ్ సీఎం సార్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ విధానాలు. నలుగురు మెచ్చేవి, పదిమందికి ఉపయోగపడే అంశాలనే జనసేన ముందుకు తీసుకువెళ్తుంది. జీవితంలో ఒడిదొడుకులు, కష్టాలు ఎదుర్కొని నిలబడితేనే ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి సహకరిస్తేనే భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుంది."
"పార్టీ భావజాలాన్ని నమ్మే మనుషుల్ని జనసేన కలుపుతుంది. మీరంతా ఇదే నమ్మకాన్ని కనబరుస్తూ ఇచ్చే బలంతో మీరు ఆశిస్తున్న విధంగా జాతీయ పార్టీ స్థాయికి ఎదిగేలా పని చేస్తాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సిద్ధాంతాన్ని నమ్మే సమూహం కావాలి అన్నదే నా ఉద్దేశం. ఉద్దానం కిడ్నీ సమస్య గురించి మొదట్లో నాకు తెలియదు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఐదారుగురు యువకులు దీనిపై పోరాడేందుకు ముందుకు వచ్చి సమస్యను నాకు తెలియజేశారు. సమస్య పరిష్కారం వెతికితే ఎక్కడో దగ్గర దారి దొరుకుతుంది. కదలిక మొదట చిన్నగా ఉండొచ్చు. కానీ దానిపై పోరాటం మొదలు పెడితే అందర్నీ కదిలిస్తుంది. ఉద్దానం ప్రాంతంలో భూగర్భ జలాలు తవ్వాల్సిన లోతు కంటే చాలా లోతుగా తవ్వడంతో తాగడానికి పనికి రాని నీరు తాగడం వల్ల కిడ్నీలు వాటిని డయగ్లోసిస్ చేయలేక కిడ్నీ సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాల లేమితో ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఉద్దానం కిడ్నీ సమస్యను ప్రపంచానికి తెలియజేసి పాలకులను కదిలించేలా మనం పోరాడగలిగాం అంటే దానికి మూలం అయిదారు మంది యువతే. సమస్యపై పోరాడడానికి తెగువ, ధైర్యం ఉండాలి. అలాంటి సమూహాన్ని తయారు చేయాలన్నదే నా కల." అని అన్నారు.
సినిమా అభిమానాన్ని వ్యవస్థీకృతం చేయాలి
"సినిమా మాధ్యమం నా బలం. కోట్ల మంది అభిమానుల్ని సంపాదించి పెట్టిన రంగం. సినిమాల్లో నటించకుండా ఉంటే రాజకీయంగా ఈ స్థాయికి రావడానికి నాకు సుమారు 30, 40 ఏళ్లు పట్టేది. ఇంతటి అభిమాన బలాన్ని రాజకీయంగా వ్యవస్థీకృతం చేయాలి. బయటకు రావాలంటే గతంలో అభిమానుల తాకిడి చాలా బలంగా ఉండేది. తోపులాటలు జరిగేవి. నేను రాజకీయంగా ఒక బలమైన సిద్ధాంతం నమ్మి, ఒక భవిష్యత్తు రాజకీయ వ్యూహంతో వస్తే నాకు అభిమాన బలం ఎంత అండగా నిలిచిందో, ఒక్కోసారి అదే అభిమానం అడ్డంకిగా మారింది. ఇప్పుడు సినిమా అభిమాన బలాన్ని మెల్లగా జనసేన పార్టీ రాజకీయ వ్యవస్థీకృత సైన్యంగా తయారు చేయాలి. ఇప్పుడు చాలా మంది నిబద్ధత గల నాయకులుగా మారి 1000 నుంచి 10000 మందిని కదిలించే శక్తిని సంపాదించారు. ఇది మరింత పెరగాలి. మన కష్ట కాలంలోనే మనవాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని తెలుస్తుంది. పార్టీలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ పార్టీ కోసం చూపిన చొరవ, తీసుకున్న బాధ్యత బలమైనవి. నిరంతరం పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఆయన మమేకమైన తీరు వేల కట్టలేనిది."
ఎవరో ఒకరికి బాధ్యత అప్పగించడం నా ఉద్దేశం కాదు
"పార్టీ సంస్థాగతంగా ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నాము అని చాలామంది అడుగుతారు. జనసేన పార్టీని స్వచ్ఛందంగా భుజం మీద వేసుకొని నడిపిస్తున్న వాళ్లు జన సైనికులు, వీర మహిళలే. వారు పార్టీకి ఉన్న బలం. ఎలాంటి స్వార్థం లేకుండా ఒక భావజాలాన్ని నమ్మి పార్టీని ముందుకు నడిపిస్తున్నది వారే. పార్టీ సంస్థాగతంగా ఎవర్నో ఒకరిని తెచ్చి నియమించడం నాకు ఇష్టం లేదు. పార్టీ సిద్ధాంతాలతో పది మందిని కలిపే శక్తీ, ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ జెండాను వదలని తెగువ ఉన్నవారితో పార్టీ నిర్మాణం జరగాలి అన్నది నా ఆకాంక్ష. అప్పుడే పార్టీ పునాదులు బలంగా ఉంటాయి. గతంలో పార్టీ మీటింగుల్లో అరుపులు, కేకలు, ఒక రకమైన ఉక్కిరిబిక్కిరి వాతావరణం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా తగ్గి ఆలోచనలకు పునాది వేస్తూ ముందుకు తీసుకువెళ్లే స్థాయికి ఎదిగాం."
జాతి ఉన్నతే జనసేన లక్ష్యం
"దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి పార్టీ ఏదో ఒక ప్రత్యేకమైన కారణంతో, తమకు అన్యాయం జరిగిందనో, తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందనో పురుడు పోసుకున్నవే. జనసేన పార్టీ మాత్రం జాతి ఉన్నతిని, దేశ సంక్షేమాన్ని ఆలోచించి నెలకొల్పిన పార్టీ. నా సిద్ధాంతాలు చాలా కచ్చితంగా ఉంటాయి. జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు వెంటనే పూర్తయిపోతాయి అని కాదు. వాటి వల్ల అందరికీ మేలు జరగాలి అన్నదే కీలకం. సుదీర్ఘంగా లక్ష్యాలు ఉన్నప్పటికీ వాటిని సాధించే భావజాలం జనసేన పార్టీ సమూహానికి ఉంది. చాలామంది రాజకీయ పండితులు పార్టీ సిద్ధాంతాలు చూసి, వీటివల్ల ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. ఒక కులం ఆధారంగా లేదా మతం ఆధారంగా, ప్రజల భావోద్వేగ సమస్యను తీసుకొని సిద్ధాంతాలుగా పెడితేనే బాగుంటుందని సూచించారు.
జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు దేశం కోసం, జాతి సంక్షేమం కోసం రూపొందించినవి. ఆశలు లేకుండా ఆశయాలు నమ్ముకున్న వాడే రంగంలో అయినా ముందుకు వెళ్తాడు. పదవులు పొందిన రాజకీయ నాయకులు దాన్ని కచ్చితంగా బాధ్యతగా తీసుకోవాలి. క్షేత్రస్థాయిలోని జనసైనికులు వీర మహిళల బాధలు వినాలి. పదవి వచ్చింది అంటే అది ఒక్కరికే కాదు. ఆ పదవిని పొందడానికి వెనుక లక్షల జన సైనికులు, వీర మహిళల కష్టం ఉందని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిలబడితే ఎవరైనా తల వంచాల్సిందే. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి జనసేన పార్టీ పాటు పడుతుంది."
పార్టీని వదిలేయలేదు.. పాలనపై పట్టు పెంచుకున్నా
"కూటమి ప్రభుత్వం రాగానే నేను జనసేన పార్టీని వదిలేశాను.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని రకరకాల మాటలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభుత్వ పాలనలో నాకు అనుభవం లేదు. పాలన గురించి పూర్తిగా తెలియదు. చిన్న పిల్లాడు ఈత నేర్చుకున్న విధంగా పాలనలో ప్రతి రోజు కొత్త విషయాలను తెలుసుకున్నాను. దీనికి ఎనిమిది, పది నెలల సమయం పట్టింది. అయితే ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని, క్షేత్రస్థాయిలో పార్టీ ముందుకు వెళ్తున్న తీరును తెలుసుకుంటున్నాను. జనసేన పార్టీకి స్థాయి, సత్తా గల బలమైన నాయకత్వం ఉండాలి. వార్డు స్థాయి నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు బలమైన నాయకత్వం తయారు చేయాలి.
2008 నుంచి మొదలైన నా రాజకీయ ప్రయాణంలో ఎన్నో చూసాను. 2009లో ఒక పార్టీ ప్రయాణం ప్రారంభానికి రాష్ట్రం నలువైపుల నుంచి 18 నుంచి 20 లక్షలు మంది జనం తరలి వచ్చారు. ఆ బలం ఎందుకు వీగిపోయింది అన్న వేదన నుంచి కొత్త రాజకీయ ఆలోచన మొదలైంది. బలమైన సిద్ధాంత భావజాలం మాత్రమే రాజకీయ పార్టీని ముందుకు తీసుకువెళ్తుంది అని నమ్మాను. నేను సిద్ధాంతాన్ని ఎంత బలంగా నమ్మి, ఆచరిస్తానో అంతే బలంగా ముందుకు తీసుకువెళ్తాను. జనసేన పార్టీలో సరైన వ్యక్తులకు సరైన బాధ్యతలు అప్పగించాలి అన్నదే ఆలోచన. వార్డు సమస్య కూడా నా వరకు వచ్చింది అంటే క్షేత్రస్థాయిలో నాయకత్వం సరిగా పనిచేయలేదని అనుకోవాలి. ఏ స్థాయి సమస్యలు ఆ స్థాయి నాయకులు వెంటనే పరిష్కరించేలా దానికి దారి చూపేలా ఉండాలి. అలాంటి నాయకత్వం తయారు కావాలి."
తప్పనిసరి పరిస్థితుల్లోనే సినిమాలు చేస్తున్నా
"పోరాట యాత్రలో భాగంగా సినిమాలు మానేద్దామని భావించాను. అయితే తర్వాత నా సిద్ధాంతాలు, భావజాలాన్ని బతికించుకోవాలంటే జనసేన పార్టీ ప్రయాణం కచ్చితంగా ఉండాలి అని నిర్ణయించుకొని, పార్టీని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో సినిమాలు తప్పనిసరై చేస్తున్నాను. పది మందికి తోడ్పడాలి అంటే రాజకీయ ప్రయాణం తప్పనిసరి అని భావించి పార్టీ కోసమే సినిమాలు చేశాను. నన్ను కూడా చాలామంది నమ్మలేదు. నరేంద్ర మోడీ గుర్తించిన తర్వాతే చాలామందికి పవన్ అంటే నమ్మకం వచ్చింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి పరిస్థితులు, అప్పటి రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మన పరిస్థితులు పూర్తిగా వేరు. ప్రతి కష్టం నన్ను పలకరించింది. ఎన్నో వేదనలు, అవమానాలు, అవహేళనలు జయించి ముందుకు నడిచాను. ఈ ప్రయాణంలో ప్రతి అడుగునా తోడు ఉంది జనసైనికులు, వీర మహిళలే."
మారింది వాళ్లు... మేము కాదు
జనసేన మూల సిద్ధాంతాల వెనుక ఎంతో మేథోమధనం జరిగింది. పార్టీ ప్రారంభించి దశాబ్ద కాలం అయింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నమ్ముకున్న సిద్ధాంతాలు, భావజాలాన్ని వదల్లేదు. నాకు ఎంతో ఇష్టమైన వామపక్ష నాయకుడు ‘‘తమ్మి నువ్వు మారిపోయావు. మమ్మల్ని వదిలేశావు’’ అని మాట్లాడారు. నేను మిమ్మల్ని వదిలేయలేదు. మీరే మీ సిద్ధాంతాలను వదిలేశారని చెప్పాను. మహారాష్ట్రలో స్వరాజ్యం నా జన్మ హక్కు అనే బాలగంగాధర్ తిలక్ నినాదం నుంచి మహారాష్ట్ర మరాఠిలదే అనే వరకు వచ్చింది. రాష్ట్రాల పునర్ విభజనకు మేము పూర్తి వ్యతిరేకం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించింది. కారణాలు ఏమైనా మార్పు చెందారు. నోరుంది, ఆర్థిక బలం ఉంది కనుక మీరు ఏం చేసినా చెల్లుబాటు అయ్యింది.
మేము మాత్రం ఇంకా తిలక్ నినాదం వద్దే ఆగిపోయాము. మహారాష్ట్రలో ఎవరికైనా అన్యాయం జరిగినా మా కడుపు మండుతుంది. బంగ్లాదేశ్లో హిందువులకు అన్యాయం జరిగినా మా కడుపు మండుతుంది. ఇదే నా చివరి రోజు అనే రాజకీయాల్లోకి వచ్చిన రోజే నిర్ణయించుకున్నా. అలానే బతుకుతున్నా. సమాజం, ప్రజలు అంటే అంత పిచ్చి ఉండబట్టే పార్టీని దశాబ్ధ కాలంగా నడుపుతున్నాను. నాలుగు దశాబ్ధాలుగా తెలుగు రాజకీయాలను గడగడలాడించిన పార్టీ నాయకుడిని జైల్లో ఉంచితే ఎవరూ రాలేదు.. మనం నిలబడ్డాం. విశాఖలో మనల్ని నిర్బంధిస్తే ధైర్యంగా ఎదుర్కొన్నాం. మన మీద ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే ... ఆ రోజు చంటి బిడ్డను చంకలో పెట్టుకొని ఓ తల్లి మనకు అండగా రోడ్డు మీద నిలబడింది. "
"పార్టీల స్నేహాన్ని వాడుకొని ఎదగాలని అనుకోవడం లేదు"
వైసీపీ ప్రభుత్వం నన్ను ఎంతో ఇబ్బందిపెట్టింది. బీజేపీ పెద్దలతో ఉన్న స్నేహం ఉపయోగించుకొని నేను ఒక్క ఫోన్ చేయించొచ్చు. కానీ నేను అలా చేయను. ఎందుకంటే నాకు పొగరు అడ్డమొస్తుంది. ఇది నా ఇంటి సమస్య. నేనే తేల్చుకోవాలి అనుకుంటాను. ఎన్నో పోరాటాలు చేశారు కనుకే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన బీజేపీ కార్యకర్తగా ఉన్న సమయంలోనే జమ్మూకశ్మీర్ ప్రాంతంలో తిరిగి అక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు. కనుకే అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370 రద్దు చేయగలిగారు. వాళ్లు పోరాటం చేసి అక్కడకు చేరుకున్నారు. మనం పోరాటాలు చేసి వెళ్తేనే వాళ్లు గౌరవం ఇస్తారు. అంతే తప్ప పార్టీల మధ్య ఉన్న స్నేహాన్ని వాడుకొని ఎదగడం నాయకత్వం అనిపించుకోదు. కష్టాల కొలిమిలో కాలిన ఇనుమే కత్తిలా మారుతుంది. అలాంటి కత్తికే పదునెక్కువ ఉంటుంది. డబ్బులు ఖర్చు చేస్తే నాయకులు అవ్వరు. క్షేత్రస్థాయిలో నలగాలి. అలాంటి నాయకుల కోసమే ఎదురుచూస్తున్నాను.
ఖండాలు దాటినా లాక్కొస్తాం అనే భయం పుట్టాలి
"శాంతి వచనాలు చెప్పే చోట శాంతి వచనాలు చెప్పాలి. పోరాటం చేయాల్సిన చోట పోరాటం చేయాలి. బలవంతుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలడు. ఎదిరించేవాడు లేకపోతే గూండాలు, రౌడీలు రాజ్యమేలుతారు. మనల్ని సోషల్ మీడియాలో ఇష్టానుసారం బూతులు తిడతారు. మనల్ని తిట్టినవాడు ఖండాలు దాటి ఉన్న మెడపట్టుకొని లాక్కొస్తామనే భయం వాడికి పుట్టించాలి. లేకపోతే మనల్ని నలిపేస్తారు. గత ప్రభుత్వానికి ఎందుకు అంతలా మీరు భయపడుతున్నారు అని నేను చాలా మందిని అడిగితే వాళ్ల దగ్గర గుండాలు, రౌడీలు ఉన్నారండి అని చెబుతారు. వాళ్ల దగ్గర పదివేల మంది గుండాలు ఉంటే మనం 5 కోట్ల మంది జనం ఉన్నాం. మనం కొట్టే దెబ్బకు అల్లాడిపోవాలి. జనసైనికులు నాయకులుగా ఎదగడం కాదు. నాయకులను తయారు చేసే విధంగా ఎదగాలని అన్నారు."