Anakapalle Crime News: అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసిన హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఘటన జరిగిన 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కశింకోట మండలం బయ్యవరం బ్రిడ్జి కింద రెండు కాళ్లు, చేతులు బెడ్​ ​షీట్​లో చుట్టి ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. 


వెంటనే వచ్చిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అలా విచారణ చేస్తున్న వాళ్లకు తల, మొండెం అనకాపల్లి డైట్ కాలేజీ దగ్గర లభించాయి. వీటన్నింటినీ ఒకచోట చేర్చిన పోలీసులు చనిపోయిది ఓ హిజ్రాగా గుర్తించారు. ఆ వ్యక్తి పేరు దిలీప్​ అలియాస్ దీపు అని తెలిసింది.  


ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు చాలా షాకింగ్ విషయాలు తెలిశాయి. మునగపాక మండలం నాగులపల్లిలో ఉండే దీపు బన్నీ  అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతని పరిచయం ఏర్పడటంతో అప్పటి వరకు క్లోజ్‌గా ఉన్న హిజ్రా కమ్యూనిటీకి దూరంగా ఉంటూ వచ్చింది. ప్రేమ సంగతి కూడా ఎవరికీ చెప్పలేదు. 


ఇది ఎవరు చేశారని మొదట చాలా మందికి చాలా అనుమానాలు కలిగాయి. చివరకు ప్రియుడు బన్నీయే ఆమెను హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీశారు. అనకాపల్లి ఎస్పీకి ఫోన్ చేసి వివర్లు అడిగి తెలుసుకున్నారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. 


బన్నీని అరెస్టు చేసిన పోలీసులు హత్య చేసిన విధానాన్ని  రీకన్‌స్ట్రక్షన్‌ చేయించారు. ఎందుకు హత్య చేశాడో విచారిస్తున్నారు. ఈ వివరాలు ఇంకా బయటకు రాలేదు. మరోవైపు తన స్నేహితురాలిని చంపిన బన్నీని తమకు అప్పగించాలని హిజ్రాలు ధర్నా చేశారు. ఆమెను ఎలా చంపాడో అతన్ని కూడా అలానే చెంపాలని డిమాండ్ చేశారు. 


ఈ కేసును ఛేదించడానికి అనకాపల్లి పోలీసులు 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఎస్పీ ప్రస్తుతానికి సెలవులో ఉండటంతో విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు.