Ayyanna Patrudu Comments : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)... ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (Sharmila Reddy) అంతమొందించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. షర్మిలకు ప్రత్యేక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం (Visakhapatnam)లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అయ్యన్న మాట్లాడారు. రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారని.. వాటిని జగన్ ఇవ్వడం లేదని ఆరోపించారు.  జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్‌ అనే తేడా ఉండదన్నారు. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులు చేజారిపోతాయనే భయం జగన్‌కి ఉందన్న అయ్యన్నపాత్రుడు...రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఆస్తులను పంచడం లేదన్నారు. సీఎం జగన్ సిద్దం సభలో క్యాట్ వాక్ చేయడానికి శిలువను ఉపయోగించుకోవడం అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రా పగటి వేషగాడా అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. 


రివాల్వర్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేశా
ఎస్పీ గన్‌మెన్‌ను ఇస్తానంటే వద్దని చెప్పానన్న అయ్యన్నపాత్రుడు...రివాల్వర్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేశానన్నారు. తాను ఎక్కడ ఉన్నానో గన్‌మెన్‌లే సమాచారం ఇస్తారని...అందుకే వారిని వద్దని చెప్పినట్లు వెల్లడించారు. అనకాపల్లి పార్లమెంట్ సీటు కోసం తన కుమారుడు దరఖాస్తు చేశారని..అధిష్ఠానం పరిశీలిస్తోందన్నారు. మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ దగ్గర...తన కుమారుడు విజయ్ రెండేళ్లు శిక్షణ పొందారని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. అన్ని విధాల విజయ్ సమర్ధుడని, ఆదరించాలని కోరారు.


ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధన ఏమైంది ? 
తాండవ రిజర్వాయర్ కు నీరురాకుండా కుట్రలు చేస్తున్నారని, 99% హామీలు నెరవేర్చానంటే ఎలా నమ్ముతామని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన, రైల్వే జోన్ సంగతి ఏమైందన్న అయ్యన్న...2లక్షల 30 వేల ఉద్యోగాల సంగతి ఏమైందని, జాబ్ కాలెండర్ విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. పోలీసులతో తప్పుడు పనులు చేయించారని.. పోలీసులను కూడా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.


మూడ్నెళ్ల తర్వాత అందరి లెక్కలు తేలుస్తాం
మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తేలుస్తామన్నారు చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ లండన్‌, అమెరికాలో దాక్కున్నా లాక్కొస్తామి, దోచుకున్న సొమ్మంతా కక్కించి తీరుతామన్నారు. జగన్ ను వదిలిపెట్టేదే లేదన్నారు. వైసీపీ భూములను కబ్జా చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. ఎక్కడ భూమి నచ్చితే దాన్ని లాగేసుకుంటారని మండిపడ్డారు. విశాఖలో 125 చోట్ల స్ధలాలు అమ్మేసి 25 వేల కోట్లు తెచ్చుకున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.


ఉత్తరాంధ్రకు ఏం చేశారు ? 
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు. చెప్పారా? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు బెదిరించి భూములు లాక్కుంటున్నారని, వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందని విమర్శించారు. విశాఖ బీచ్‌ రోడ్డు నుంచి భీమిలి వెళ్లే వరకు ప్రభుత్వ భూములను మిగిల్చారా? ఇక్కడి ప్రజలు ఎందుకు మీకు ఓట్లేయాలి? భూములు దోచుకున్నందుకా? ఓటు వేయాలా అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు.