అధికార వైఎస్సార్‌సీపీతో పోరాటంలో పార్టీ నేతలు కలిసికట్టుగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానేడు వేదికగా పిలుపునిచ్చారు. కానీ ఒకవైపు అధికార పక్షంతో దీటుగా పోరాడాల్సిన సమయంలో టీడీపీ శ్రేణులు అంతర్యుద్ధానికే మొగ్గు చూపుతున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. కింజరాపు, కళా వర్గాల మధ్య విభేదాలున్నాయని, తాజాగా సోషల్ మీడియాలో ఓ ప్రకటన వైరల్ అవుతోంది. పార్టీని బలోపేతం చేయాల్సిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు.. సీనియర్ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును తప్పించారని సోషల్ మీడియాలో ఓ లేఖ దర్శనమిచ్చింది. ఇక అది మొదలు పార్టీలో అంతర్గత పోరా, లేక అధికార వైఎస్సార్‌సీపీ చేస్తున్న ప్రచారమా అని అర్థంకాక తలలు పట్టుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు.


అసలేం జరిగిందంటే..


టీడీపీలో ఎచ్చెర్ల నియోజకవర్గం సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును పార్టీ బాధ్యతల నుంచి తప్పించారని, ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కనిపించింది. కళా వెంకట్రావు స్థానికుడు కాదు.. ఎప్పటికప్పుడూ పార్టీలు మారుతూనే ఉన్నారని, దీనికి తోడు వయోభారంతో టీడీపీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం లేదని ఆ లేఖలో ఉంది. కళా వెంకట్రావును పార్టీ బాధ్యతల నుంచి, కలిశెట్టి అప్పలనాయుడికి ఆ బాధ్యతలు అప్పజెబుతున్నారని సోషల్ మీడియా పోస్టు సారాంశం. 


మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రజలకు అందుబాటులో ఉండరని, ఆయన స్థానికుడు కాదని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వేరే పార్టీలోకి వెళతారన్న అపవాదు కూడా ఉంది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడికి నమ్మిన బంటు కలిశెట్టి అప్పలనాయుడికి పార్టీ బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరగడం టీడీపీలో కొత్త వివాదానికి తెరతీసింది. కానీ వెంకట్రావుకు పార్టీ అధినేత చంద్రబాబు వద్ద మంచి పలుకుబడి ఉంది. నారా లోకేష్‌తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే పార్టీ కష్టకాలంలో వేరే పార్టీలోకి వెళ్లే నేతను తొలగించడం సబబేనని ఓ వర్గం అంటుంటే, సీనియర్ నేత కళా వెంకట్రావును బాధ్యతల నుంచి తప్పించడం ఏంటని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అచ్చెన్నాయుడు వ్యూహాత్మక దాడి? ప్రత్యర్థుల కుట్రనా ?
కింజరాపు, కళా వర్గాల మధ్య వర్గపోరు తారా స్థాయికి చేరిందా అని పార్టీలో మరోసారి చర్చ మొలైంది. శ్రీకాకుళం శంకర్, ఎచ్చెర్లలో కలిశెట్టి అప్పలనాయుడు, పాతపట్నంలో మామిడి గోవిందరావు లాంటి నేతలను అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్నారు. వీరు పార్టీని విజయపథంలో నడిపించే వారు కాదన్న వాదన ఉంది. తన వారిని అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తూ సీనియర్ నేతను పార్టీ బాధ్యతల నుంచి తప్పించారని కళా వెంకట్రావు వర్గీయులు భావించారు. కానీ కింజరాపు, కళా వర్గాల మధ్య అగ్గిరాజేస్తున్నది ఎవరు అనే విషయంపై పార్టీ అధిష్టానం ఫోకస్ చేసింది. గతంలో నారా లోకేష్‌పై చంద్రబాబు కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చేశారని సైతం సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమివ్వడం కలకలం రేపింది. తాజాగా కళా వెంకట్రావు తొలగింపు అని మరో రచ్చ మొదలైంది. పార్టీ శ్రేణులకు, కళా వెంకట్రావు వర్గానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఆధిపత్యం చెలాయించడంలో భాగంగా అచ్చెన్నాయుడు కళా వెంకట్రావు వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి.






క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్టానం..
సీనియర్ నేత కళా వెంకట్రావును పార్టీ బాధ్యతల నుంచి తొలగించడం అనేది అవాస్తవం అని పార్టీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ఫేక్ అని ట్వీట్ చేసింది. ఫేక్ లీడర్ జగన్ మోసపు రెడ్డి పెట్టిన ఫేక్ పార్టీ వైసీపీ.. తమ పార్టీ టీడీపీని ఎదుర్కోలేక రోజుకో ఫేక్ లెటర్ వదులుతోందంటూ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళా వెంకట్రావును పార్టీ బాధ్యతల నుంచి తప్పించారని ఆగస్టు 12న సోషల్ మీడియాలో ప్రచారం జరగగా, అది ఫేక్ అని ఆగస్టు 13న టీడీపీ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసి క్లారిటీ ఇచ్చింది.