CM jagan In Vizag :   ఎపి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న గ్లోబ‌ల్ ఇన్వేస్ట‌ర్ ల మీట్ లో పాల్గొనేందుకు   ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విశాఖ చేరుకున్నారు. గ‌న్న‌వ‌రం నుంచి ప్ర‌త్యేక విమానంలో విశాఖ‌ కు చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. శుక్ర, శనివారాల్లో   గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో జ‌గ‌న్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి వ‌చ్చే పారిశ్రామిక వేత్త‌ల‌తో భేటీ కానున్నారు. 4వ తేదీ మ‌ధ్యాహ్నం గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ ముగిసిన అనంత‌రం విశాఖ నుంచి బ‌య‌ల్దేరి తాడేప‌ల్లిలోని త‌న నివాసానికి చేరుకుంటారు.


ఇదీ ముఖ్యమంత్రి షెడ్యూల్ 


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారి పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. రాత్రి 8.00 – 9.00 ఎంజీఎం పార్క్‌ హోటల్‌లో జీఐఎస్‌ డెలిగేట్స్‌కు ఏర్పాటు-చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు, అనంతరం రాత్రి బస చేసి శనివారం ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


వైసీపీ హయాంలో తొలిసారి పెట్టబడుల సమ్మిట్  


వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్నారు.  పెట్టుబడులను ఆకర్షించేదిశగా మంత్రులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగానే ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను స్వయంగా ఆహ్వానించారు. అలాగే వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా అందుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. తాజాగా శుక్ర, శని రెండు రోజులపాటు జరిగే పెట్టుబడుల సదస్సులో పాల్గొని దేశ విదేశాల నుండి వచ్చే ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనస్వాగతం పలికేందుకు మంత్రులంతా బుధవారమే విశాఖకు చేరుకున్నారు.  





 


రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం                          


విశాఖ వేదికగా జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. కార్యక్రమంలో సుమారు 25 దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 7,500 మంది ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా ఏపీలో అందుబాటులో ఉన్న వనరుల గురించి ప్రభుత్వ పెద్దలు సదస్సులో మరోసారి స్పష్టంగా వివరించబోతున్నారు. ఆ మరికొన్ని జిల్లాల్లో అనుకూలమైన భూములను కూడా కొత్త పరిశ్రమలక సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున ఎంవోయూలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.