Srikakulam Politics : సిక్కోలు వైసీపీలో రాజకీయ శూన్యత - రాజకీయ కురువృద్ధుడి టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టింది.. ప్రసాదరావు ప్రణాళికలే - 2009లో పదింటికి తొమ్మిది గెలుచుకుని రికార్డు - అప్పట్లో దివంగత వైఎస్ఆర్ అభయహస్తంతో ముందుకు.. - కాంగ్రెస్కు జవసత్వాలు నింపి.. ఉత్తరాంధ్రలో వైభోగం - జగన్ మనస్తత్వం..వైఎస్ఆర్కు పూర్తి విరుద్ధమన్న బావనలో నేత - రాజకీయ వ్యూహం లేకుండా.. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమిస్తారంటూ..ఆవేదన


వైసీపీకి దూరంగా ధర్మాన   
 
ధర్మాన.ప్రసాదరావు..సిక్కోలు రాజకీయ యవనికపై అతడో అధ్యాయం. జిల్లా రాజకీయాలను ఔపోషన పట్టిన కురువృద్ధుడు. ఒకరకంగా చెప్పాలంటే.. నడుస్తున్న రాజకీయ లైబ్రరీ. అత్యంత పటిష్టమైన వ్యూహాలు, అద్భుతమైన ప్రణాళికలు రచించగల సమర్థుడు. దివంగత వైఎస్ఆర్ హయాంలో శ్రీకాకుళంతో పాటు ఉత్తరాంధ్ర రాజకీయాలు అతని చుట్టూ తిరిగేవి. టీడీపీకి కంచుకోటలాంటి శ్రీకాకుళం జిల్లాలో..కాంగ్రెస్ ప్రభంజనం సాగింది అంటే.. అది ధర్మాన వ్యూహరచన, సోషల్ ఇంజినీరింగ్ వల్లే. ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు.రామా రావు, దివంగత మాజీ ఎమ్మెల్యే జుత్తు. జగన్నాయకులు వంటి బలహీనవర్గాలకు చెందిన నాయకులు.. ఎమ్మెల్యే టిక్కెట్లు సాధించటం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. 2009లో పది సీట్లకు గాను.. తొమ్మిది సీట్లు గెలుచుకుని..కాంగ్రెస్ సత్తా చాటింది. కానీ కాలం గిర్రున తిరిగింది. వైఎస్ఆర్ దివికేగారు. తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ప్రసాదరావు.. జగన్తో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. వాస్తవానికి అప్పుడే ఆయన పతనం ప్రారంభమైంది. కానీ అలా నెట్టుకొచ్చారు. 'జగన్ చెబితే వినడు.. సరైన వ్యూహరచన చేయడు..ప్రజలు వ్యతిరేకిస్తున్నారు' అంటూ..పలు సందర్భాల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. వైసీపీ కార్యక్రమాలకు, జగన్ సమావేశాలకు డుమ్మాకొట్టేస్తున్నారు. తనకు అత్యంత ఇష్టమైన..వైఎస్ఆర్ జయంతి, వర్ధంతులకు కూడా ఆయన హాజరుకాకపోవడం వెనుక ఏదో నిగూడార్థం దాగుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..



కొడుకు భవిష్యత్తు కోసం..


ప్రస్తుతం ప్రసాదరావు తన కుమారుడు, రాజకీయ వారసుడు రామ్మనోహన్ నాయుడి కోసం అలోచిస్తున్నారని సమాచారం. వైసీపీలో రాజకీయ భవిష్యత్తు శూన్యమని ఓ నిర్ణయానికి వచ్చినట్టు భోగట్టా. అందుకే తాడేపల్లిలో జగన్ నిర్వహించిన జిల్లా స్థాయి రివ్యూ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో అందరి దృష్టీ ప్రసాదరావుపైనే పడింది. ఎందుకు హాజరుకాలేదన్న అంశంపై పెద్దఎత్తున చర్చ నడిచింది. అత్యంత విశ్వసనీయవర్గాలసమాచారం ప్రకారం..ఆయన రాజకీయ వైరాగ్యంలో ఉన్నారని.. రాజకీయంగా ఎటు వైపు అడుగులు వేయాలని సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రసాదరావు ఆలోచనలు అన్నీ కుమారుడు, రాజకీయ వారసుడు ధర్మాన రామమనోహర్ నాయుడు మీదనే ఉన్నాయని ఆయన మనసెరిగిన వారు చెబుతున్నారు. ఏ పార్టీలో చేర్పిస్తే రాజకీయంగా నిలదొక్కుంటారు అని ఆలోచిస్తున్నారట. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కుమారుడికి శ్రీకాకుళం శాసన సభ టికెట్ ని ప్రసాదరావు అడిగారు. దానికి జగన్ నిరాకరించారు అన్న ఆవేదన ప్రసాదరావులో ఉంది అని అంటున్నారు. జగన్ తండ్రి వైఎస్ఆర్తో కలిసి రాజకీయాలు చేశానని..అప్పట్లో ఎంతో విలువ ఇచ్చేవారని, కానీ జగన్ మాత్రం కనీసం గౌరవం ఇవ్వడం లేదన్న ఆవేదన సైతం ధర్మానలో ఉంది. ఈ కారణాలు విశ్లేషించుకున్న తరువాతే ధర్మాన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని ఆయన ఆంతరంగికులు చెబుతున్నారు. 


ఆయన వైసీపీలో కొనసాగుతారా? 


రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన ధర్మాన ప్రసాద్ 2024 ఎన్నికలకు నేను పోటీ చేయను అని చెప్పిన బలవంతంగా పోటీ చేయించారు కూటమి అధికారం రావడం... ఒక భాగమైతే సర్పంచ్ స్థాయిలో ఉంటూ వ్యక్తి ఎమ్మెల్యేగా ఎదగిన గుండు శంకర్ చూసి మరి కాస్త కుమిలిపోతున్నారు. దీంతో క్యాడర్ను కూడా ఎవర్ని కలవకుండా కార్యకర్తలు ఎవరిని కూడా పార్టీ సంబంధించిన వ్యవహారాలు అయితే నా దగ్గరికి రావద్దు అని నేరుగానే చెబుతున్నారు. ఇక సొంత పని ఏదైనా ఉంటేనే మాత్రం రండి. నీ ముక్కు సూటిగానే మొహం మీద చెప్పేశారు దీంతో కార్యకర్తలు ఏం చేయాలో తెలియని అగమ్య గోచరంగా తయారయ్యారు.  ధర్మాన రామ్మోహన్ నాయుడు కి రాజకీయం పూర్తిస్థాయిలో నెక్స్ట్ ఎన్నికల్లో బరిలో దించేందుకు ధర్మాన పక్కా వ్యూహం పొందుతున్నారని కొంతమంది చెబుతున్నారు.