Firecracker Manufacturing Plant In Anakapalli | అనకాపల్లి జిల్లాలోని కోటబరట్ల మండలం కైలాస పట్నంలో జరిగిన అగ్నిపురమాదంలో మృతుల సంఖ్య 8 కి చేరింది. బాణాసంచా తయారీ కేంద్రంలో ఆదివారం ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి గోడలు కూలిపోయి, బాణాసంచా తయారు చేస్తున్న కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో మొదట ఐదుగురు కార్మికులు చనిపోయారని సమాచారం వచ్చింది. ఆపై మరో ముగ్గురు కార్మికులు సైతం ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 8కి చేరింది. అగ్ని ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అగ్నిప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ.15లక్షలు చొప్పున బాధితుల కుటుంబాలకు పరిహారం అందించనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న అనిత అక్కడికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

బాధితులంతా కాకినాడ జిల్లా సామర్లకోట వాసులుగా గుర్తించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం 15 మంది మంది కార్మికులున్నారు.  మృతులను

తాతబాబు 50 ఏళ్లు, గోవింద 45 ఏళ్లు,  రామలక్ష్మి 38 ఏళ్లు,నిర్మల 36 ఏళ్లు,పురం పాపా 40 ఏళ్లు,  బాబు 40 ఏళ్లు,బాబురావు 56 ఏళ్లు,మనోహర్ అని గుర్తించారు.

ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

అనకాపల్లి జిల్లా కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారం ఆందోళన కలిగించింది. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి వంగలపూడి అనితతో ఫోన్‌లో మాట్లాడాను. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించాను. అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని ఆరా తీశాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం, ధైర్యంగా ఉండాలి. ఘటనపై విచారణ చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు.
 

బాధితులకు అండటా ఉంటామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అనకాపల్లి జిల్లా కోటవురట్ల దగ్గర బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున భారీ పేలుడు ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనితకు ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు  వివరాలు, బాధితుల పరిస్థితి గురించి తెలిపారు. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటుందన్నారు. బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకొంటుందని తెలిపారు.

ఇటీవల కిందట అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వెళ్ళిన సమయంలో విశాఖలో భారీ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమల్లో పర్యావరణ సంబంధిత అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలతోపాటు భద్రతపరమైన జాగ్రత్తల గురించి చర్చించాలని భావించినట్లు తెలిపారు. కానీ అనుకోని ఘటన కారణంగా అత్యవసరంగా సింగపూర్ వెళ్లాల్సి వచ్చిందన్నారు. తదుపరి విశాఖ పర్యటనలో ఈ అంశంపై దృష్టిపెడతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.