Adudam Andhra News: విశాఖలో ఆడుదాం ఆంధ్రా తుది పోటీలను విశాఖలోని రైల్వే స్టేడియంలో శుక్రవారం ఉదయం పర్యాటక, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఫైనల్ పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మంత్రి రోజా ప్రతిపక్షాలు, వారికి సహకరించే మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆడుదాం ఆంధ్రా కిట్‌లపై సీఎం ఫోటో వేస్తే తప్పేంటి? అని ప్రశ్నించిన మంత్రి రోజా.. ఆంధ్రా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో వేయాలా? అని పేర్కొన్నారు. పచ్చ మీడియా కడుపు మంటతో రగిలిపోతోంద‌ని మంత్రి రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2024 ఎన్నికల తర్వాత నాన్ లోకల్‌ పొలిటీషియన్‌లు చంద్రబాబు, పవన్,  లోకేష్, షర్మిల తెలంగాణా  పారిపోవడం ఖాయమని, జగన్‌మోహన్‌రెడ్డి సింహంలా మ్యానిఫెస్టోతో సిద్దంగా వుంటే, ప్రతి పక్ష పార్టీలు  ఇంకా సిద్దంగా లేరని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్‌ అని, మళ్లీ జగన్‌ సీఎం కావడం ఖాయమ‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు. 


షర్మిలపైనా రోజా తీవ్ర ఆగ్రహం


షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని, వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారని ఆరోపించారు. షర్మిలకి తాను ఒక సలహా ఇస్తున్నానని, ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుంచి మనకి రావాల్సిన ఆరు వేల కోట్లు, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు రాబ‌ట్టాలన్నారు. టూర్ లు పెట్టి ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేసిందో షర్మిల చెప్పాలని మంత్రి రోజా డిమాండు చేశారు. ఏపీలో ఏమి లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్నారో షర్మిల చెప్పాలని, వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసి ఉండే వాళ్ళు అని చెప్పిన షర్మిల.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ లో మళ్ళీ జాయిన్ అయ్యారో చెప్పాలని మంత్రి నిల‌దీశారు. గట్స్‌ ఉన్న నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్‌ అని, చంద్రబాబు, లోకేశ్‌, టీడీపీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయన్నారు. బాబు తమ చిత్తూరు జిల్లాలో పుట్టడం సిగ్గుచేటు అని మంత్రి దుయ్య‌బ‌ట్టారు. అధికారంలోకి రావాలన్న కాంక్షతోనే కాంగ్రెస్‌తో ఒకసారి, బీజేపీతో ఇంకోసారి పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పొలిటికల్‌గా రోజురోజుకు చంద్ర‌బాబు దిగజారిపోతున్నారని ఎద్దేవా చేశారు. 


ఆడుదాం ఆంధ్రతో యువతకు మేలు


గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో పోటీల‌ను నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ పోటీలకు విశేష స్పందన వచ్చిందని, జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఈ నెల 13 వరకు ఫైన‌ల్ పోటీలు నిర్వ‌హించ‌నున్నట్టు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కు 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నరని, ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుందని,13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్‌ హాజరుకానున్నారని తెలిపారు. ఈ క్రీడల్లో విజేతలకు దాదాపు రూ.12 కోట్ల బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆమెతో పాటు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.