వైజాగ్ ఎయిర్ పోర్ట్‌కు అదనపు సౌకర్యాలు సమకూరాయి. ప్రస్తుతం ఉన్న విమానాల పార్కింగ్ బేల సంఖ్య పెరిగింది. ఇంతకు ముందు ఒకేసారి నిలుప గల విమానాల సంఖ్య 6 ఉంటే ఇప్పుడది 12కు చేరింది. వైజాగ్ ఎయిర్ పోర్ట్ ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణించే వారితో బిజీబిజీగా మారింది. పైగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతోపాటు రాజకీయంగా గానూ వైజాగ్ కీలకంగా మారడంతో రోజూ ఇక్కడకు వచ్చి పోయేవారి సంఖ్య పెరుగుతుంది. వారిలో చాలామంది రైల్, బస్సు, కార్ వంటి ప్రయాణ సాధనాల కంటే విమానా లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. 


దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి చార్జీల విషయంలో పెద్దగా తేడా లేకపోవడంతోపాటు.. జర్నీ సమయం బాగా కలిసి రావడమే దీనికి కారణం. దానితో వైజాగ్ ఎయిర్ పోర్ట్ రద్దీగా మారడంతో అదనపు హంగులు అవసరం అయ్యాయి. ఒకవైపు భోగాపురం ఎయిర్ పోర్ట్ తయారుకావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ సామర్ధ్యం పెంచడం పైనే అధికారులు దృష్టి పెట్టడంతో ఆ దిశగా పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒకేసారి 12 విమానాలను నిలుపగలిగే స్థాయికి ఎయిర్పోర్ట్ చేరుకోవడం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా సర్వీసులు పెంచడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 


కరోనా సమయంలో ప్రయాణాలు లేకపోయినా.. గత సంవత్సరంలో మళ్ళీ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణాలు పెరిగాయి. గత ఏడాది 16 లక్షల మందికిపైగా వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణాలు సాగించారు. ఈ రద్దీ మరింత పెరుగుతూ ఉండడంతో కొత్తగా మరో టెర్మినల్ భవనాన్ని ఇక్కడ నిర్మించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారుల నుంచి అనుమతులు రాగానే ఈ భావనం ప్రయాణికులకు అందుబాటులోనికి రానుంది. 


ఒకే సమయంలో మూడు వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్‌లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగని స్థాయికి ఎయిర్పోర్ట్ సామర్ధ్యం పెంచారు. ఇక ప్రయాణికులు లగేజీ కోసం ఎక్కువ సమయం ఎదురుచూడకుండా మరో రెండు లగేజీ హ్యాండలింగ్ బెల్ట్‌లను ఏర్పాటు చేశారు. దీనితో వైజాగ్ ఎయిర్పోర్ట్ సామర్ధ్యం ఒక్కసారిగా పెరగడంతోపాటు ప్రయాణికులకు సమయం కూడా బాగా కలిసి రానుందని అధికారులు చెబుతున్నారు .