Turaka Kishore: వైసీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ తురకా కిషోర్‌ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఓ కేసులో బెయిల్ వచ్చి విడుదలై ఇంటికి వచ్చిన మరుక్షణమే అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షసాధింపులకు దిగుతోందని మండిపడుతున్నారు.  గుంటూరులో హైడ్రామా నడిచింది. వివిధ కేసుల్లో మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్‌ తరుకా కిషోర్‌ రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో ఆయన గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఇంటికి వచ్చిన మరుక్షణమే పోలీసులు మళ్లీ ప్రత్యక్షమయ్యారు. అరెస్టు చేస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. 

తురకా కిషోర్‌ను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు ఆయనకు కొంత సమయాన్ని ఇచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తీసుకెళ్లే టైంలో హైడ్రామా నడిచింది. ఆయనను తీసుకెళ్లే వాహనాన్ని అనుచరులు, కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన కుమార్తెలు, భార్య ఏడుస్తూ పోలీసులు కారుకు అడ్డుగా నిల్చున్నారు. 

ఏ కేసులో అరెస్టు చేస్తున్నారు... ఎందుకు ఇంతలా కక్ష సాధింపులకు దిగుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈవీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారారు.  

ఇప్పటికే ఓ కేసులో అరెస్టుఅయ్యి దాదాపు 8 నెలలుగా జైలులో ఉన్నారు. ఆ కేసులోబెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్టు చేయడంపే కుటుంబ సభ్యులు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వానికి కక్ష ఉండొచ్చు కానీ మీ ఇంతలా వేధిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తన భర్తను చంపేస్తారేమో అని కిషోర్‌ భార్య అనుమానం వ్యక్తం చేశారు. కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకింతా అనుభవిస్తారని ఆమె శపించారు. జగన్ అండగా ఉంటారని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డీతో చెల్లిస్తామని సవాల్ చేశారు. 

ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. తండ్రిని కుటుంబానికి దూరం చేసి కూటమి ప్రభుత్వం పాపం మూటగట్టుకుంటుందని శాపనార్థాలు పెడుతున్నారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని అంటున్నారు. 

దీనికి కౌంటర్‌గా టీడీపీ నేతలు పోస్టులు పెడుతున్నారు. గతంలో తురకా కిషోర్ చేసిన రౌడీయిజాన్ని గుర్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల టైంలో టీడీపీ నేతల, వారు ప్రయాణించిన కారుపై చేసిన దాడి విజువల్స్ పోస్టు చేస్తున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు హీరో అని చెప్పుకొని ఉండొచ్చు కానీ ఇప్పుడు దానికి శిక్ష అనుభవించక తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు.