Andhra Pradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై కక్ష పెట్టుకున్నారని అందుకే తన కుమారుడు రాజీవ్‌ను అరెస్టు చేయించారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ఇంటిపైకి ఆ రోజు దాడికి వెళ్లాలన్న కక్షతోనే ఇదంతా చేస్తున్నారని అన్నారు. అసలు ఆరోజు తాను దాడి చేయడానికి వెళ్లలేదని కేవలం చంద్రబాబును కలిసేందుకు మాత్రమే వెళ్లాలని చెప్పుకొచ్చారు. జగన్ మోహన్‌రెడ్డిపై అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్‌ తెలియజేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లినట్టు వివరించారు. చంద్రబాబును కలిసి నిరసన తెలియజేసి వ్యవస్థను సరిచేయాలనే చెప్పడానికే అలా చేశానని చెప్పారు.


అప్పుడు జరిగిన విషయాన్ని చంద్రబాబు, లోకేష్‌ మనసులో పెట్టుకొని తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు జోగి రమేష్. ఇప్పటి వరకు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు తాను చేయలేదని... మంచి చేస్తే మంచి చేశారని చెబుతామని అనుకున్నట్టు వివరించారు. అయితే ఇంత వరకు అలాంటి మంచి పని చేసినట్టు కనిపించలేదన్నారు.


రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్ష సాధింపులతోనే ప్రభుత్వానికి టైం సరిపోతుందని అన్నారు జోగి రమేష్. కోపం ఉంటే తనపై తీర్చుకోవాలని సూచించారు. అంతేకాని ఏమీ తెలియని తన కుమారుడిని అరెస్టు చేయడం ఏంటని నిలదీశారు. పత్రికల్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకొని ఇలా కేసులు పెట్టి వేధించడం ఏంటని అన్నారు. 


అగ్రిగోల్డ్ భూములు అటాచ్‌మెంట్‌లో ఉన్నాయని అన్నారు జోగి రమేష్. అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములు ఎవరైనా కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించారు. అందులో కేవలం 2వేల ఎకరాల కోసం కక్కుర్తి పడతామా అని ప్రశ్నించారు. తాము కొన్న భూములు కూడా చట్ట ప్రకారమే కొనుగోలు చేశామన్నారు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన తర్వాత క్రయవిక్రయ జరిపామని తెలిపారు. 


చట్ట ప్రకారం చేసిన క్రయవిక్రయాలపై కూడా ఇలాంటి కేసులు పెట్టి అమాయకులను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు జోగి రమేష్. అధికారంలో ఉన్న వాళ్లు ఇలాంటి చర్యలకు దిగితే మంచిది కాదన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండొచ్చని తర్వాత వేరే వాళ్లు రావచ్చన్నారు. చంద్రబాబుకి కూడా ఓ కొడుకు ఉన్నడని మర్చిపోవద్దని జోగి రమేష్ హెచ్చరించారు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికీ అంతే దూరమని వార్నింగ్ ఇచ్చారు. అన్నింటినీ మర్చిపోయి సూపర్ 6 పథకాలు ఎలా అమలు చేయాలో ఆలోచించాలని సూచించారు. వాటిని అమలు చేయడం రాక ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.