Andhra Pradesh News: ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ- యాగీ చేస్తున్నారని షర్మిలపై ఫైర్

Jagan Vs vijayamma: ఉమ్మడి ఆస్తులు అనే భావన ఉంటే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారని ప్రశ్నిస్తోంది వైసీపీ. విజయమ్మ రాసిన బహిరంగ లేఖపై వైసీపీ కౌంటర్. నానా యాగీ చేయొద్దని సూచన

Continues below advertisement

YSRCP Counter Letter To Vijayamma: జగన్ -షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదంపై తల్లి విజయమ్మ  నిన్న ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనికి వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ లేఖ వచ్చింది. అనుకోని ఆపరిణామంతో షాక్‌కు తిన్న కౌంటర్ లేఖలో చాలా అంశాలపై ప్రస్తావించారు. మొత్తం 16 పాయింట్లతో ఉన్న ఈ లేఖలో జగన్ రాజకీయ ప్రత్యర్ధుల ట్రాప్‌లో విజయమ్మ పడ్డారని ఆరోపించారు. కోర్టు కేసులు పూర్తయ్యాక షర్మిలకు ఏమి ఇవ్వాలనేది తేలుస్తామని పేర్కొన్నారు. ఆ లేఖ లోని అంశాలు యథాతథంగామీకోసం...!

Continues below advertisement

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ లేఖ... 
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భార్యగా, జగన్ మోహన్ రెడ్డి తల్లిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తాం. వైఎస్‌ కుటుంబ వ్యవహారంపై విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేసినందున కొన్ని అంశాలు ఆమె దృష్టికి తీసుకువస్తున్నాం. విజయమ్మ రాసిన లేఖలో జగన్‌ని లీగల్‌గా ఇబ్బందిపెట్టేందుకు, తద్వారా బెయిల్‌ రద్దు జరిగే కుట్రను ప్రస్తావించకపోవడం ప్రజలను పక్కదోవపట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్‌మెంట్‌, తెలంగాణ హైకోర్టు స్టేటస్‌-కో ఆదేశాలు ఉన్నా, యాజమాన్యబదిలీ చేయకూడదనే విషయం తెలిసిందే. మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జిల న్యాయసలహాలు ఉన్నప్పటికీ షేర్లు బదిలీచేసిన మాట వాస్తమే కదా? షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై జగన్‌కి చిక్కులు తెచ్చే పనికి విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజమేకదా? విజయమ్మ లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైఎస్‌ అభిమానులను పక్కదోవపట్టించడమే కదా?

2024 ఎన్నికల్లో జగన్‌ ఒక్కరే ఒకవైపున ఉంటే, అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టుకట్టారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా, వైఎస్‌ పేరును ఎఫ్ఐఆర్‌లో పెట్టిన, కుమారుణ్ని జైలుపాలు చేసిన కాంగ్రెస్‌కు మద్దతుగా, వైసీపీని ఇబ్బందిపెుడుతూ వీడియో విడుదల చేసిన విజయమ్మ షర్మిలవైపు ఉన్నట్టు స్పష్టం చేశారు. వైఎస్‌ రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్‌ కుటుంబంపై కుట్రలు పన్నే చంద్రబాబుకు మేలుచేసేలా వ్యవహరించడం ధర్మమేనా? రాజకీయాలు పక్కనపెడితే తల్లిగా మద్దతు సంగతి దేవుడెరుగు, కనీసం తటస్థవైఖరి మరిచిపోయి, పక్షపాతం చూసి వైఎస్‌ అభిమానులు బాధపడ్డారు. 

షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో, సరస్వతీ కంపెనీ వ్యవహారంలో జగన్‌ సంతకాలు లేకుండా షేర్లు బదిలీచేసి, షర్మిలతోనే విజయమ్మ ఉన్నారని మరోసారి స్పష్టంగా చెప్పారు. జగన్‌కి, షర్మిల వ్యక్తిగతంగా రాసిన లెటర్‌ టీడీపీ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. విజయమ్మ సంతకం చేసిన ఆ ఉత్తరాన్ని టీడీపీ విడుదల చేయడం ఏంటి. జగన్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసినా చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఏరోజూ సరిదిద్దే కార్యక్రమం విజయమ్మ చేయకపోవడం ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. కోర్టుల్లో ఉన్న కేసులను ప్రభావితం చేసేలా షర్మల ప్రవర్తన, చర్యలు ఉన్నా ఒకవైపు ఆస్తులపై హక్కులు కోరుతూ, మరోవైపు అందుకు విరుద్ధంగా వ్యవహరించినా జగన్‌ని దెబ్బతీసేందుకు నడుచుకున్నా ఓపిక, సహనం, మౌనంగా ఆ బాధను జగన్‌ అనుభవించారు. ఇక్కడ అసలు బాధితులు ఎవరు? ఒక తల్లిగా విజయమ్మ బాసట ఎవరికి ఉండాలి? అన్న బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. 

రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి జగన్‌ని షర్మిల ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. తర్వాత రాజశేఖరరెడ్డిని ఎఫ్ఐఆర్‌లోపెట్టిన పార్టీకి, అన్నను జైల్లో నిర్బంధించిన పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా వచ్చారు. పోనీ రాజకీయాలు ఇంతే అనుకున్నా విమర్శల పరిధి దాటి, ఆజన్మాంత శత్రువు మాదిరిగా జగన్‌ని అనరాని మాటలు అన్నారు. ఎన్నికల టైంలో  జగన్‌పై దాడి జరిగితే ఎగతాళి చేశారు. మరి రచ్చకెక్కింది ఎవరు? పరువు తీసింది ఎవరు? నిజమైన బాధితులు ఎవరు? జగన్‌ బాధితులు కాదంటారా? 

కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లు కారణంగా విజయమ్మ విచక్షణను విస్మరించారు. కుమార్తెను వెనకేసుకువచ్చి చట్టవ్యతిరేక పనులకు తోడ్పడ్డారు. కుమారుడు ఎదుర్కోబోయే చట్టపరమైన సంక్షిష్ట పరిస్థితులేంటో తెలిసి కూడా విజయమ్మ దాన్ని విస్మరించారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం ఇదే. వైఎస్‌ జీవించి ఉన్నపుడే జగన్‌ కంపెనీలు నడిపారు. షర్మిల తన కంపెనీలు నడిపారు. ఉమ్మడి ఆస్తులే అయితే మరి ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు? వైఎస్‌ మనోభావాలు, ఆజ్ఞ వేరేలా ఉంటే ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? తన కుమార్తెకు  వైఎస్‌ తన పూర్వీకుల ఆస్తులతోపాటు, తాను సంపాదించిన ఆస్తులు ఇచ్చాడు. జగన్‌ ఆస్తులు తనవి కాదు కాబట్టి, ఇవ్వలేదు. 

షర్మిలకి పెళ్లై 20 ఏళ్లు తర్వాత జగన్‌ స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. కోర్టు కేసుల కారణంగా ఒక ఎంఓయూ రాసి ఇచ్చారు. దీనిపై విజయమ్మ, షర్మిల సంతకాలు చేశారు. ఆ ఆస్తుల్లో హక్కులేదని ఆరోజు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా? ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం తప్పుదోవ పట్టించనట్టే. నిజంగా ఉమ్మడి ఆస్తులు అయితే పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదని, చట్టరీత్యా హక్కుగా వస్తుందని తెలియదా. 

ఇంత యాగీ చేస్తున్న షర్మిల ఈ సంస్థల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? కంపెనీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారా? కంపెనీలకున్న రూ.1400 కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచీకత్తు ఇస్తూ సంతకం పెట్టారా? లేక రూ.500 కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర ఆమె పోషించారా? ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో, చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఏరోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా? పైగా ఈ కంపెనీల మీద, జగన్‌ మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా, కంపెనీలను బలహీనపరుస్తూ సాగుతున్న వైఖరి చూస్తే వాటాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా వాటాలు ఉంటే ఇలా చేస్తారా? జగన్‌ని, కంపెనీలను ఇబ్బందులు పాలు చేస్తారా?

వైఎస్‌ కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజల ముందు ఉన్నాయి. ఒకటే వాదనను వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు స్థాయిగల వ్యక్తులు, వివిధ సందర్భాల్లో, వివిధ పద్ధతుల్లో వినిపించడం వల్ల పదేపదే బురదజల్లడం అవుతుంది తప్ప, ఫలితం ఉండదు. ఇప్పుడు ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి.

జగన్‌ స్వార్జితమైన ఆస్తిలో, ఎలాంటి హక్కులేకపోయినా, ఆ ఆస్తిలో భాగం కావాలని షర్మిల రాద్ధాంతం చేయడం ఏంటి? యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? ఆ లేఖను టీడీపీ విడుదలచేయడం ఏంటి? వైఎస్‌ కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదు. ప్రజాసమస్యలపై దృష్టి సారిస్తామని ఇదివరకే పార్టీ స్పష్టం చేసింది. అని ఇక ఈవివాదంపై స్పందిచబోమని తేల్చింది వైసీపీ. 

Continues below advertisement