YS Sharmila Meets Governor Abdul Nazeer: తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంలో తాజాగా వైఎస్ షర్మిల టీడీపీ వర్సెస్ వైసీపీ పోరులోకి దిగారు. తిరుమలను అపవిత్రం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయంగా దుమారం రేపాయి. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. గతంలో టీటీడీ ఛైర్మన్లుగా సేవలు అందించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు తీవ్రంగా స్పందించారు. ఇదే అంశంపై మాజీ సీఎం జగన్ కూడా మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఈవో మీడియా సమావేశం నిర్వహించి నెయ్యి కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టులో తేలినట్లు స్పష్టం చేశారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు.


తిరుమలను అపవిత్రం చేశారు
తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నాయని షర్మిల ఆరోపించారు. సీఎం హోదాలో.. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వులు  వాడారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతను, ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్నారు. కోట్లాది మంది హిందువులు ఆరాధించే ఆరాధ్యదైవం శ్రీవారిని కించపరుస్తున్నారని షర్మిల ఆక్షేపించారు. 'చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం.. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్‌తో రాజకీయాలు ఆడాలనే ఉద్దేశ్యం మీకు లేకుంటే.. నిజంగా నెయ్యికి బదులు జంతువుల కొవ్వులు వాడితే.. వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వేయండి. సీబీఐతో విచారణ జరిపించండి. ఘోరమైన పాపం, ఘోరమైన తప్పు చేసిన నీచుడు ఎవరో కనుక్కోండి. మీ వ్యాఖ్యలకు కట్టుబడి, నిజానిజాలు తెలుసుకోవాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.




గవర్నర్ తో షర్మిల భేటి
ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల సాయంత్రం 5గంటలకు రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.  సీబీఐ ఎంక్వైరీకి రికమెండ్ చేయాలని ఆమె గవర్నర్‌ను కోరారు. ఆధారాలతో నేరం రుజువైతే రాజకీయాలకతీతంగా, స్థాయితో సంబంధం లేకుండా వారిని కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు.  తిరుమల ప్రసాదంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందించింది. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.


 
దీనిపై ఆమె మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ అంశం మీద గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశామన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది, చాలా సెంటిమెంట్ అంశం అని వివరించామన్నారు. ఏ మతమైనా గొప్పది, ఏ ధర్మం అయినా గొప్పది. అన్ని మతాలను గౌరవించాలన్నారు. కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు బాధలో ఉన్నారు. రెండు అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎన్ డీడీబీ రిపోర్ట్ ప్రకారం లడ్డూ లో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది. ఫిష్, బీఫ్, పిగ్ కొవ్వుల నూనె ఉందని తేలింది. భక్తులకు పంపిణీ చేసే నెయ్యి 320 కే కొనడం ఏంటంటూ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. స్వామి ప్రసాదానికి వాడే నెయ్యి 16 వందలకు కొంటున్నారని తెలిపారు. స్వామి ప్రసాదాన్ని అంత రేటుకి కొని భక్తులకు ఇచ్చే లడ్డూల్లో తక్కువ రేటు నెయ్యి వాడతారా? 320 కి కొనేది నెయ్యినా ? లేక నూనేనా ? ఇంకా ఏమైనా ఉందా ? ఇక్కడే అసలు విషయం తెలుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


జులై 23 న రిపోర్ట్ వస్తే చంద్రబాబు ఇంతకాలం ఎందుకు దాచారు.  లడ్డూ కల్తీ పై సమగ్ర దర్యాప్తు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసినా కూడా కేంద్ర సంస్థలతో కూడా దర్యాప్తు చేయించాలని కోరారు. దీని కోసమే గవర్నర్‌‌ను కలిశామని విరించారు వైఎస్ షర్మిల. లడ్డూ వివాదం మీద  సీబీఐతో విచారణ చేయించాలని కోరామన్నారు. లడ్డూ కల్తీ పై భాద్యులు ఎవరో తేల్చాలన్నారు. స్వామి వారి ఆదాయం దాదాపు ఏడాదికి మూడు వేల కోట్లకు పైగానే ఉంటుంది. ఆయన సంస్థల విలువ మూడు లక్షల కోట్లకు పైనే..ప్రపంచలోనే వేంకటేశ్వరుడు అత్యధిక ధనవంతుడు. మరి అలాంటి ఆయన లడ్డూను కల్తీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ? అంటూ షర్మిల మండిపడ్డారు. వైసీపీకి దర్యాప్తు చేయాలని అడిగే హక్కు లేదు.  కల్తీ జరిగింది వాళ్ల హయాంలోనే..  వాళ్లే తక్కువ కోడ్ చేసిన కంపెనీకి ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు ? 320 కి నెయ్యి వస్తుందో, నూనె వస్తుందో తెలియదా ? మరీ అంతగా తెలియకుండా ఉన్నారా అంటూ మండిపడ్డారు. అందుకే లడ్డూ వివాదంపై విచారణ పూర్తి స్థాయిలో జరగాలి.  దోషులుగా తేలిన వారికి శిక్ష పడాలి అన్నారు.