ఈనెల 19వ తేదీన బెజవాడలోకి యువ గళం పాదయాత్ర ద్వార లోకేష్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఇదే సమయంలో కీలకంగా ఉండాల్సిన పార్టీ పార్లమెంట్ సభ్యుడు చేతులు ఎత్తేయటం చర్చ నీయాశంగా మారింది.


లోకేష్ యువగళంకు భారీ ఏర్పాట్లు...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా యువ గళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర 19వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు తెలుగు దేశం పార్టీకి చెందిన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం నుంచి లోకేష్ గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజ్‌ మీదగా విజయవాడలోకి ఎంట్రీ ఇస్తారు. ఈ సందర్బంగా లోకేష్‌కు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు క్యాడర్ ఫుల్ జోష్‌తో ఏర్పాట్లు చేస్తున్నారు. 


పార్టీలో ఇబ్బందిగా మారిన విభేదాలు...
రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ పాదయాత్ర చేస్తూ అధికారం చేపట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే గల్లీ స్థాయిలో మాత్రం పార్టీ నాయకులు, విభేదాలు ఇబ్బందిగా మారాయి. ఈ వ్యవహరమే గత ఎన్నికల్లో పార్టీని పరాజయంపాలు చేశాయి. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినా పార్టీ నాయకులు మాత్రం విభేదాల విషయంలో తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఈ విభేదాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విభేదాలను పరిష్కరిస్తున్న తన పాదయాత్రలో నాయకులు కలుపుకొని ఎలా ముందుకు వెళతారనేది సర్వత్రా చర్చనీయాశంగా మారింది.


పరాజయాలకు నాయకులే కారణమా...
తెలుగు దేశం పార్టీకి మొదటి నుంచి కార్యకర్తలే అండగా ఉంటున్నారు. అయితే నాయకులు తీరుతో కార్యకర్తలు కూడా పక్క చూపులు చూడక తప్పటం లేదు. ఇందుకు గత మున్సిపల్ఎన్నికలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానికి వ్యతిరేకంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తిరుబాటు చేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో తెలుగు దేశం ఘోరంగా పరాజయం పాలయ్యింది. కార్పోరేషన్ పరిధిలో బలమయిన క్యాడర్ ఉన్నా, నాయకుల మధ్య విభేదాలు పార్టీని దెబ్బతీశాయి.


చేతులు ఎత్తేసిన ఎంపీ...
గత ఎన్నికల్లో నేతల తీరు పట్ల పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కేశినేని నాని తీవ్ర అసహనంగా పార్టీలో ఉంటున్నారు. పార్టీలో ఉన్న నాయకులు తనను కాదని ఎదురు తిరగటం వలనే విజయం సాధించలేకపోయామనే భావనలో కేశినేని నాని ఉన్నారు. అంతే కాదు తనకు వ్యతిరేకంగా తిరుబాటు చేసిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు అప్పట్లో లోకేష్ సపోర్ట్ చేశారని, ఆయన అండతోనే అంతగా వారంతా రెచ్చిపోయారనే అభిప్రాయం కేశినేనిలో ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. 


లోకేష్ పాదయాత్ర విజయవాడలోకి ఎంట్రీ ఇస్తున్న టైంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఖర్చులు భరించాలని పార్టీ నాయకత్వం నుంచి సంకేతాలు వచ్చినా ఆయన ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఎంట్రీ నాటికి తరువాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, పాదయాత్రగా వచ్చిన లోకేష్ ఈ విభేదాలకు ఎలాంటి మార్గాలు చూపుతారనేది చర్చగా మారింది.