నాని, వంశీలపై కొందరు వైసీపీ లీడర్లు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇప్పుడు ఈ కామెంట్స్‌ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైరల్‌గా మారుతున్నాయి. దీని వల్లభనేని వంశీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పార్టీ పరంగా చేయాల్సింది చేస్తుందని అన్నారు. అయితే వ్యక్తిగతంగా తమ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయాలని చూసిన వాళ్ల డొక్కను పగల్‌దీస్తామన్నారు. 


టీడీపీ టికెట్‌పై గెలిచిన వల్లభనేని వంశీ... వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో ఆయనపై నియోజకవర్గంలో ఓడిన ప్రత్యర్థులంతా ఒక్కటయ్యారు. వంశీకి వైసీపీకి దగ్గరైనప్పటి ప్రత్యర్థులైన దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు పొసగడం లేదు. సమయం చిక్కినప్పుడల్లా వంశీకి వ్యతిరేకంగా వీళ్లిద్దరూ కామెంట్స్ చేస్తుంటారు. అదే మాదిరిగా ఓ సమావేశంలో కలిసిన దుట్టా, యార్లగడ్డ.. పిచ్చాపాటిగా మాట్లాడుతూ కొడాలి నాని, వంశీపై విమర్శలు చేశారు. 


మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశించి దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు అసహన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా వైకుంఠపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వైఎస్ఆర్ సీపీ నేతలు పాల్గొని చేసిన కామెంట్స్‌ను అక్కడే ఉన్న వాళ్లెవరో రికార్డు చేసి వైరల్ చేశారు. యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఆ కొడాలి నానీ ఏడో తరగతి తప్పిన వెధవ అని వ్యాఖ్యలు చేశారు. ‘‘వాడు ఎంతసేపూ సినిమాలంటాడు. ఏ సినిమాలోనైనా ఏం ఉంటుంది. సినిమా మొత్తం హీరో కంటే విలన్‌కే ఎక్కువ క్రేజ్‌ ఉంటుంది. చివరికి క్లైమాక్స్‌లో హీరో చేతిలో చెంపదెబ్బ తినడం రొటీన్. వాడి వల్ల గుడివాడ నియోజకవర్గానికి ఏం ఉపయోగం? అసలు వంశీ, నానీ ఏ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించారు?’’ అని యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు. వల్లభనేని వంశీ గురించి మరో నేత దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ.. వంశీ ఆగడాలను తామే ప్రశ్నించామని, అందుకే తమకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చిందని మాట్లాడారు. మీడియాను మేనేజ్ చేయడంలో వంశీ దిట్ట అంటూ యార్లగడ్డ వెంకట్రావ్ వ్యాఖ్యలు చేశారు.


దీనిపై స్పందించిన వల్లభనేని వంశీ తమ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసిన వారి డొక్క పగల్‌దీస్తామన్నారు. పార్టీ మీద గౌరవంతో తలొంచుకొని ప్రత్యర్థులను కూడా కలుపుకొని పని చేయడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. తన చేతిలో ఒక్కొక్కరిగా వచ్చి ఓడిపోయారని... గుంపులుగా కూడా చతికిల పడ్డారని ఇప్పుడు మాత్రం ఏ చేస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పార్టీ పరంగా అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. వ్యక్తిగతంగా ఇమేజ్‌ను డ్యామేజ్ చేసినందుకు ఏం చేయాలని తాను, కొడాలి నాని ఆలోచించుకుంటామన్నారు. ఏం చేయాలో అది చేస్తామన్నారు. 
ఆస్తులపై మాట్లాడి వారికి కాస్తైనా బుద్ది ఉండాలన్నారు వంశీ. తాను, కొడాలి నాని కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని... అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు ఉంటాయని అనుమానం ఉన్న వాళ్లు చూసుకోవచ్చన్నారు. 


ఇప్పటికే నెల్లూరు పంచాయితీతో సతమతమవుతున్న వైసీపీ అధిష్ఠానానికి ఇదో కొత్త తలనొప్పిగా మారుందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నప్పటికీ వాటిపై సీరియస్‌గా దృష్టి పెట్టని వైసీపీ అధినాయకత్వం ఈ సారి మాత్రం కచ్చితమైన నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉందని టాక్ నడుస్తోంది.