అమరావతిలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడులు రానున్నట్టు క్యాబినెట్‌ అభిప్రాయపడింది. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి రానుందని వివరించింది. ఈ పార్క్‌లో ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, రెండో ఫేజ్‌లో 31వేల మందికి ఉద్యోగాలు రానున్నట్టు అంచనా వేసింది 


న్యూ ఎనర్జీ పార్క్‌తోపాటు కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ అండ్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లను ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనుంది. దీనికి క్యాబినెట్ ఆమోదం లభించింది. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.


వైజాగ్ టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయిస్తూ క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు కెబినెట్ అంగీకరించింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బందరు పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి తెలిపింది. 9.75 శాతం వడ్డీతో రూ. 3940 కోట్ల రుణం తీసుకోనున్నారు. 


నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందుకు కెబినెట్ ఆమోదించింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు కెబినెట్ అంగీకారించింది. యూనిట్టుకు రూ. 2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. వైద్యారోగ్య శాఖలో రిక్రూట్మెంట్ల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు కెబినెట్ నిర్ణయించింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యూనివర్శిటిల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల కేటాయించారు. నామినేషన్ పద్దతిలో జేఎస్ డబ్ల్యూకు బెర్తుల కేటాయించారు. జే ఎస్ డబ్ల్యూ సంస్థకు 250 ఎకరాల భూమిని మారీటైమ్ బోర్డు ద్వారా కేటాయించేలా కెబినెట్ నిర్ణయించింది. 


టీటీడీకి ప్రత్యేక ఐటీ వింగ్‌కి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొన్ని జిల్లాల కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించేందుకు ఒప్పుకుంది. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంత, చిత్తూరు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించాలని నిర్ణయించారు. తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు అంగీకారించారు.