Tension at Vijayawada City Court : 
ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో విజయవాడలోని సిటీ కోర్టు కాంప్లెక్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కక్షగట్టి చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు. టీడీపీ మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో విజయవాడ సిటీ కోర్టు వద్దకు చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు టీడీపీ మహిళా కార్యకర్తలను అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని ముందే గ్రహించిన పోలీసులు కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సిట్ అధికారుల విచారణ పూర్తయిన తరువాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తరువాత ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరచనున్నట్లు సమాచారం.


చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సెప్టెంబర్ 9 తెల్లవారు జామున నుంచే రాష్ట్ర స్ధాయి నుంచి మండల స్ధాయి టీడీపీ ముఖ్యనేతల్ని పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. మరికొందరు నేతల్ని పోలీస్ స్టేషన్లలో నిర్బందించారు. చంద్రబాబు కాన్వాయ్ నంద్యాల నుంచి ప్రారంభమై తాడేపల్లి లోని సిట్ కార్యాలయానికి చేరుకునే వరకు దారి పొడవునా రోడ్లు దిగ్బందం చేసి ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహించారు. పలు చోట్ల జగన్ దిష్టిబొమ్మలు దగ్గం చేసి, టైర్లు కాల్చి  తమ నిరసన తెలిపారు. 


సాయంత్రం కాగడాల ప్రదర్శనలు నిర్వహించారు. మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి అక్రమ అరెస్టును నిరసిస్తూ తమ సంఘీభావం తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి చంద్రబాబు కాన్వాయ్ ని ముందుకు కదలకుండా అడ్డుకుని తెలుగు తమ్ముళ్లు టీడీపీ అధినేతకు మద్దతు తెలిపారు. విద్యార్ది, యువత, మహిళలు, వృద్దులు సైతం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అక్రమ అరెస్టును నిరసిస్తూ తమ సంఘీభావం తెలిపటంతో పాటు సీఎం జగన్ చర్యల్ని తీవ్రంగా ఖండించారు. అవినీతి అనేది లేని కేసులో సైతం కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును  అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 


ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. అక్రమ కేసులతో న్యాయస్ధానాలలో పోరాటం చేసి ప్రజాక్షేత్రంలో జగన్ రెడ్డి తప్పుల్ని, అక్రమాల్ని ఎండగడతామని టీడీపీ నేతలు అంటున్నారు. నిరసనకు దిగగా పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, గొల్లపల్లి సూర్యారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, భూమ అఖిల ప్రియ, పొలిట్ బ్యూరో సభ్యులు గుమ్మడి సంద్యారాణి,  కిమిడి కళా వెంకట్రావు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాస్, బుద్దా నాగజగదీశ్వరరావు, నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణ, బి.కె పార్థసారథి, మల్లెల రాజశేఖర్ గౌడ్, బిటి నాయుడు, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గణబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, అంగర రామ్మోహన్ తదితరులు ఉన్నారు.