Murder Attempt Case On TDP Former Mla Dhulipalla Narendra Kumar:  తెలుగుదేశం పార్టీ (Telugudesam Party)సీనియర్ నేత, పొన్నూరు (Ponnuru) మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Former Mla Dhulipalla Narendra Kumar) పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నెల 15న సంగం డెయిరీ వద్ద తమపై దాడి చేశారని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంకు చెందిన రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాము కంప్లయింట్ ఆధారంగా ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పాల విక్రయానికి సంబంధించి 14 శాతం బోనస్‌ ఇవ్వలేదని, మాట్లాడదామని డెయిరీ వద్దకు పిలిచి కర్రలు, హాకీ స్టిక్‌లతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో తమ మూడు కార్లు ధ్వంసం అయ్యాయన్నారు. రాము ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. 


ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నరేంద్ర


1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రోడ్ ప్రమాదంలో మృతి చెందడంతో నరేంద్ర రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టి. వెంకటరామయ్య పై 21,729 ఓట్ల మెజారిటీ సాధించారు. 1994 నుండి 2014 వరకు వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్టు నెలకొల్పారు. 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. నరేంద్ర 2003 లో పార్టీ రైతు విభాగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు  నిర్వహించారు. సంగం పాల డైరీ ఛైర్మన్ గానూ పని చేశారు.