సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తాను జీవితాంతం రాజకీయాల్లో ఉండాలని కోరుకునే వ్యక్తిని కాదన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా లేకుంటే కేశినేని భవన్‌లో కూర్చొని ప్రజలకు సేవ చేసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. 


కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటూ వస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఆదివారంలో వైసీపీ ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురిపించిన నాని ఇవాళ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్లను అభినందిస్తానన్నారు నాని. 


వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ నాలుగేళ్లుగా తనకు తెలుసు అన్నారు కేశినేని నాని. వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రశంసించాను అన్నారు. తనకు తెలిసినంత వరకు మొండి తోక బ్రదర్స్ చాలా మంచి వాళ్లు అని మరోసారి కితాబు ఇచ్చారు. 


ఇసుకలో వాటాలు, మైనింగ్‌లో వాటాలు ఇవ్వకపోతే ధర్నా చేసేలా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయబోనంటూ నాని సీరియస్ కామెంట్స్ చేశారు. బెజవాడ పార్లమెంట్‌కు ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలుస్తానన్నారు. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దాడుతా అని కేసిఆర్ అంటే తాను బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ళ పందితో అయినా కలుస్తాను అంటూ వ్యాఖ్యానించారు. 


ఎంపీగా ఉన్న తాను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు నాని. వైసీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఉదయభాను, మొండి తోక సమన్వయము చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నాను అన్నారు. 


ప్రతిపక్షాలతో సిద్ధాంత పరమైన ఫైట్ ఉంటుందన్నారు కేశినేని నాని. బెజవాడ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు. తాను ఢిల్లీ మనిషిని అన్నారు. ఎంపీగా ఉన్నా లేకపోయినా తనకు ఉన్న పరిచయాలతో బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని చెప్పుకొచ్చారు. తాను ఏమన్నా మాట్లాడితే పార్టీ మారుతున్నా అని ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థులను ఎద్దేవా చేశారు. తన వల్ల టీడీపీకి నాలుగు ఓట్లు పడాలి అనే పనులే చేస్తానన్నారు. 


గడ్కరీ, చంద్రబాబుకి తాను శిష్యుడినని చెప్పుకొచ్చారు కేశినేని నాని. వెనుకబడిన బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసమే పని చేస్తానన్నారు. తన శ్వాస, ఊపిరి అన్నీ బెజవాడ పార్లమెంట్ కోసమే అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు.