Krishna Godavari Floods: ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర ప్రదేశ్లోని కృష్ణా గోదావరి నదులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. అంతే కాకుండా ఏపీ లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 1.5 & 5.8 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడకక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
కృష్ణా,గోదావరి నదుల వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా కొనసాగుతుందని ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం రాత్రి 9 గంటల నాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,48,100 క్యూసెక్కులు ఉందని, రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. గరిష్ఠంగా ప్రకాశం బ్యారేజి వద్ద 7 లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరే అవకాశం ఉందన్నారు.
గోదావరి నది భద్రాచలం వద్ద 46.4 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 9,93,318 లక్షల క్యూసెక్కులు ఉందని, రాత్రికి మొదటి హెచ్చరిక చేరుతుందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఎల్లుండికి దాదాపు 12 నుంచి 12.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సహాయక చర్యల కోసం 2 NDRF, 4 SDRF బృందాలు కృష్ణా, గుంటూరు, బాపట్ల, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీపరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.
కృష్ణా, గోదావరి వరద ప్రవాహం కొనసాగుతున్న నేేపథ్యంలో వరద సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఏపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
వరదల సమయంలో..
• వరదనీటిలోకి ప్రవేశించవద్దు.• మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.• విద్యుద్ఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలు, పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి.• ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్హూల్స్ను గుర్తించి ఆ ప్రదేశంలొ కనిపించే విధంగా చిహ్నాలు, ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.• వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయవద్దు, రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు గుర్తుంచుకోండి.• తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ప్లేట్/కవర్ తో మూసి ఉంచండి.• వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు త్రాగాలి.• మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడండి.
వరదల తరువాత..
• మీ పిల్లలను నీటిలోకిగాని, వరద నీటి సమీపంలోకి ఆడటానికి పంపకండి.• దెబ్బతిన్న విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు, వాటిని తనిఖీ చేయండి.• అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్విచ్లులను, ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆపివేయండి. తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు.• విరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, పదునైన వస్తువులు, శిథిలాలను నిశితంగా పరిశీలించండి.• వరద నీటిలో కలిసిన ఆహారాన్ని తినవద్దు.• మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి.• వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి.పాముకాటుకు ప్రథమ చికిత్స తెలుసుకోండి.• నీటి మార్గాలు / మురుగునీటి పైపులు దెబ్బతిన్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నీటిని వాడకండి.• నీరు తాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.
మీరు ఖాళీ చేయవలసి వస్తే..
• మంచం, టేబుళ్లపై మీ ఫర్నిచర్, ఇతర ఉపకరణాలను పెట్టండి. • మీ కరెంట్, గ్యాస్ కనెక్షన్ ఆపివేయండి• ఎత్తైన భూ ప్రదేశం / సురక్షిత ఆశ్రయానికి వెళ్లండి.• మీ వద్ద ఉన్న అత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె, విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళండి.• లోతైన, తెలియని జలాల్లోకి ప్రవేశించవద్దు, నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి.• అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళండి. • కుటుంబ సమాచార ప్రణాళికను రూపొందించుకోండి. • తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి. క్రిమిసంహారకం చేయండి.