మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బస్సు డ్రైవర్ అవతారం ఎత్తారు. గుడివాడ బస్టాండ్లో నూతనంగా ప్రారంభించిన బస్సులను పట్టణంలో ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే కొడాలి నాని తిప్పారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో పల్లె వెలుగు బస్సులను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. గుడివాడ ఆర్టీసీ డిపోకు కొత్తగా వచ్చిన ఐదు హైర్ బస్సులను కొడాలి నాని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో పల్లె వెలుగు బస్సును స్వయంగా నడుపుతూ ఎమ్మెల్యే కొడాలి నాని సందడి చేశారు.


ఈ నూతన పల్లె వెలుగు బస్సు సర్వీసులు గుడివాడ నుండి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్నాయి. ఈ బస్సులు S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద మంజూరయ్యాయి. స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరులు, ఏర్పాటు చేస్తున్న బస్సులను ప్రారంభించడం సంతోషకరమని కొడాలి నాని మాట్లాడారు.


రాష్ట్రంలోని దళితులు ఆర్ధికంగా ఎదిగి స్థిరపడాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే అన్నారు. కొత్తగా ఆర్టీసీ లీజుకు తీసుకున్న 5 బస్సులను ఆయన ప్రారంభించారు. ఎంఎస్ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సబ్సిడీతో ఒక్కొక్కరికి రూ.50 లక్షల యూనిట్ విలువతో ఐదు బస్సులను ఎస్సీలకు మంజూరు చేశారు. లబ్ధిదారులు పొందిన ఈ నూతన బస్సును ఆయన బస్టాండ్ నుండి నెహ్రూచాక్ వరకు నడిపి ప్రయాణికులను, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశారు.


ఇటీవలే వివేకానందరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకానందరెడ్డి ఎప్పుడూ వైఎస్ జగన్ వెంట నడవలేదని, సీఎం జగన్ నాశనం కోరుకునేవారు వివేకా ఫ్యామిలీలో ఉన్నారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ అంటే ఏంటో చంద్రబాబు మరోసారి చూస్తారని, మార్చి 18వ తేదీ నుంచి  జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ ను హత్యచేసి చంద్రబాబు పార్టీతో పాటు సీఎం పదవిని తీసుకున్నారని ఆరోపించారు. వర్ల రామయ్య, పట్టాభి వంటి వాళ్లు చంద్రబాబు వద్ద జీతగాళ్లు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకా చనిపోవడం వల్ల సీఎం జగనుకేమైనా ఆస్తి వచ్చిందా..? పదవి ఏమైనా వచ్చిందా..? అని కొడాలి నాని ప్రశ్నించారు.


లోకేషుకు తాత గొంతు రావడమేంటీ.. అయితే ఆ వచ్చిన గొంతు ఖర్జూర నాయుడు గొంతై ఉంటుందని, ఎన్టీఆర్ గొంతు అయి ఉండదన్నారు. ఎన్టీఆర్ బతుకుంటే లోకేష్ మాటలు విని ఆత్మహత్య చేసుకుని ఉండేవారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనాసుర రక్త చరిత్ర ఎవరు చదువుతారు. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం అని, సోషల్ మీడియా ఉందనే ఐ-టీడీపీ పెట్టారన్నారు. బుక్స్ చదువుతున్నారంటే పేపర్ టీడీపీ అని రాయండి. తడిగుడ్డతో గొంతులు కొయడం ఎలా అని బుక్ రాయమనండి అని సూచించారు. 


వైఎస్ వివేకా చనిపోతే ఆస్తులు ఎవరికెళ్లాయి..?
వైఎస్ వివేకానందరెడ్డి, సీఎం జగన్ తో కలిసి నడిచి వచ్చిన వ్యక్తి కాదని, విజయమ్మ మీద కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడించే ప్రయత్నం చేశారంటూ కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా చనిపోతే జగనుకేమైనా ఆస్తులొచ్చాయా..? పదవి ఏమైనా వచ్చిందా ? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కుటుంబం సర్వనాశనం కోరుకునే వ్యక్తులు వైఎస్ వివేకా ఫ్యామ్లీలో ఉన్నారని, వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబమే జగన్ వెంట నడిచారని చెప్పారు. భాస్కర్ రెడ్డి కుటుంబానికే జగన్ టిక్కెట్టిస్తారు. టిక్కెట్ ఎవరికివ్వాలో జగన్ ఇష్టం అన్నారు.