Vijayawada Dussehra Celebrations: దసరా వచ్చేస్తుంది. అందులోనూ విజయవాడ దుర్గ గుడిలో జరిగే దసరా వేడుకలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఫేమస్. అయితే ఇటీవల విజయవాడ నగరం మొత్తం వరదలతో ఇబ్బంది పడడంతో ఈసారి దసరా వేడుకలు గతంలోలా జరుగుతాయా లేదా అమ్మవారి వైభవాన్ని ఈ ఏడాది  చూడగలమా లేదా అని భక్తులు సందేహించారు. కానీ ఈసారి కూడా దుర్గ గుడిలో దసరాను ఎంతో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అక్టోబర్ 3 నుంచి 12 వరకూ దసరా నవరాత్రులు జరుగుతాయని దుర్గగుడి కమిటీ తెలిపింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే సామాన్య  భక్తులకు సైతం సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం కల్పించడంతోపాటు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ డా. సృజన అధికారులను ఆదేశించారు. 


ప్రతీ రోజూ  లక్ష మంది మూలా నక్షత్రం రోజు మూడు లక్షల మంది 
అక్టోబర్‌ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై  విజయవాడ లో జిల్లా కలెక్టర్‌ సృజన, పోలీస్‌ కమిషనర్‌ . రాజశేఖర్‌ బాబు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. కొండ ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగి పడకుండా ఇప్పటికే దేవస్థానం పటిష్ట చర్యలు తీసుకుందనీ అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా మరింత అలర్ట్ గా  దుర్గ గుడి అధికారులు ఉండాలన్నారు. పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.


దసరా ఉత్సవాలలో ప్రతి రోజు లక్ష మందికిపైగా భక్తులు వస్తారని.. మూలా నక్షత్రం రోజున రెండు నుంచి మూడు లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు జిల్లా కలెక్టర్. దీనిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండ వల్ల గాని  వర్షం వల్ల గాని క్యూలైన్‌లలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాతల సహకారంతో తాగునీరు, పాలు, అల్పాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని ఆ సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా  తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సృజన తెలిపారు. 


ఇతర ప్రాంతాల నుంచి రానున్న 3500 మంది పోలీసులు 
విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు మాట్లాడుతూ... దసరా ఉత్సవాలలో రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది అమ్మవారి దర్శనానికి తరలివస్తారు కాబట్టి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు చెందిన పోలీసులతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే 3,500 మంది సిబ్బంది సేవలను దసరా ఉత్సవాల‌్లో వినియోగిస్తామన్నారు. ఏర్పాట్ల పరిశీలనకు ప్రతి సెక్టార్‌ కి ఒక స్పెషల్ ఆఫీసర్ పరిశీలనలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. దుర్గ గుడి ఘాట్‌ సమీపంలో గల కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా దసరా ఉత్సవాల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు.


దసరా కోసం ప్రత్యేక వెబ్ సైట్ 

స్థానిక ఎమ్మెల్యే  సుజనా చౌదరి మాట్లాడుతూ గతం కంటే మరింత మెరుగ్గా దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు భక్తుల సలహాలు తీసుకునేలా ప్రత్యేక వైబ్‌ సైట్‌ రూపొందించాలని తెలిపారు. వృద్ధులు, విభిన్నప్రతిభావంతులు విఐపిలు, వివిఐపిలకు ప్రత్యేక టైమ్‌ స్లాట్‌లను కేటాయించి వారికి ముందుగానే తెలియపరిచి ఆయా సమయాలలోనే అమ్మవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని ఆయన సూచించారు. భక్తులకు హోల్డింగ్‌ ప్రాంతాలను ఏర్పాటు చేసి వెయిటింగ్ లేకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.  



అమ్మవారి అవతారాలు ఇవే
             
దుర్గ గుడి ఈవో కె.ఎస్‌. రామరావు మాట్లాడుతూ ఈ ఉత్సవాలలో అమ్మవారు పది అవతారాలలో భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. అక్టోబర్‌ 3వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి, 4న శ్రీ గాయత్రీ దేవి, 5న అన్నపూర్ణ దేవి, 6న  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, 7న శ్రీ మహాచండీ దేవి, 8న శ్రీ మహలక్ష్మి దేవి, 9న శ్రీ సరస్వతి దేవి, (మూలా నక్షత్రం) 10న శ్రీ దుర్గాదేవి, 11న శ్రీ మహిషాశురమర్థినీ దేవి, 12న శ్రీ రాజరాజేశ్వరి దేవి  అమ్మవారి అలంకారంతో దర్శనం ఇస్తారన్నారు.  ఆన్లైన్‌ టికెట్‌ లేకుండా వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రిసెప్షన్‌, టోల్‌గేట్‌,  హోమ్‌ టర్నింగ్‌, పున్నమి ఘాట్‌, వియంసి ఆఫీస్‌, కలెక్టర్‌ ఆఫీస్‌, స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌, మోడల్‌ గెస్ట్‌ హౌస్‌, హెడ్‌ వాటర్‌ వర్క్స్‌,  బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ల వద్ద కరెంటు టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.


వినాయకుడి గుడి నుంచి టోల్‌గేట్‌ ద్వారా కొండపైన ఓం టర్నింగ్‌ వరకు మూడు క్యూ లైన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓం టర్నింగ్‌ వద్ద ఉచిత దర్శనం, వి ఐ పి క్యూ లైన్లతో కలిపి మొత్తం 5 క్యూ లైన్లు ఉంటాయన్నారు.  భక్తులకు తాగునీరు అందించేందుకు ఈ ఏడాది వాటర్‌ ప్యాకెట్లతో పాటు వాటర్‌ బాటిళ్లను కూడ సరఫరా చేయనున్నామన్నారు. కనకదుర్గానగర్ వద్ద ప్రత్యేక ప్రసాదం కౌంటర్లుతోపాటు  కొండపైన ఓం టర్నింగ్‌ వద్ద  ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని 25 లక్షల లడ్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రథం సెంటర్‌, మున్సిపల్‌ఆఫీసు, సీతమ్మ వారి పాదాలు, కుమ్మరి పాలెం, పున్నమి ఘాట్‌ వద్ద ఉచిత చెప్పుల స్టాండ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


భక్తులు స్నానమాచరించేందుకు సీతమ్మ వారి పాదాల వద్ద 500 షవర్స్‌,  పున్నమి ఘాటు వద్ద 100, భవాని ఘాట్‌ వద్ద 100 షవర్స్‌లతో పాటు  150 టెంపరరీ మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులకు అమ్మవారి ఉచిత ప్రసాదం కింద పులిహోర, కట్టు పొంగలి, దద్దోజనం, సాంబారు రైస్ మహామండపం ఎదురుగా గల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి జరుగుతున్న దసరా వేడుకలు కావడంతో వీటిని సూపర్ సక్సెస్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది


Also Read: ఆయుధ పూజ దసరా సమయంలోనే ఎందుకు చేస్తారు!