దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి మరోసారి బూతులతో రెచ్చిపోయారు. ఆయన జనంలో కంటే వివాదాల చుట్టే ఎక్కువ ఉండారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్‌గా ఉన్న ఆ ఎమ్మెల్యే బుధవారం రాత్రి ఓ పెళ్లి వేడుకలో రెచ్చిపోయారు. బూతులతో దూషణలు అందుకున్నారు. 

దెందులూరులోనే ఓ వివాహ వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని హాజరయ్యారు. అదే టైంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ లీడర్‌ అబ్బయ్య చౌదరి కూడా వచ్చారు. ఇదే అసలు వివాదానికి కారణమైంది. తన కారుకు అడ్డంగా అబ్బయ్య చౌదరి కారు పెట్టారని చింతమనేని బూతులు అందుకున్నారు. అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్‌పై వినడానికి, రాయడానికి ఇబ్బందింగా ఉండే బూతులతో రెచ్చిపోయారు. జరుగుతున్న తంతంగాన్ని వీడియో తీస్తున్న వారిని ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే తీరు ఇలా ఉందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. 

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను హత్య చేయడానికి వైసీపీ శ్రేణులు వచ్చాయని ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి వట్లూరులో వివాహానికి హాజరై వస్తున్నప్పుడు అటాక్ జరిగిందని ప్రచారం చేస్తున్నారు. 

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారుకు ఉద్దేశ్యపూర్వకంగా తమ కారును అడ్డుపెట్టి గొడవకు దిగారని అంటున్నారు. అబ్బయ్య చౌదరి, ఆయన అనుచరులు ప్లీప్లాన్ ప్రకారమే చేశారని అందుకే వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. 

కారు అడ్డం తీయాలంటూ చింతమనేని డ్రైవర్ రిక్వస్ట్ చేస్తే పథకం ప్రకారం 25మంది వైసిపి మూకలు దాడి చేశారని వివరస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, డ్రైవర్ సుధీర్, గన్ మెన్ రవీంద్రపై ఐరెన్ రాడ్‌, కర్రలతో దాడికి యత్నించారన్నారు. ఎదురు తిరిగే సరికి వారంతా పరారు అయ్యారని వెల్లడించారు.  

ఈ దాడి గురించి తెలుసుకున్న దెందులూరు నియోజకవర్గ ప్రజలు దుగ్గిరాల క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారని వెల్లడించారు. ఒక్క సైగ చేస్తే వైసిపి అల్లరి మూకల పని పడతామని నినాదాలు చేశారని ఆవేశం వద్దు - చట్టాన్ని ఎవ్వరూ చేతిలోకి తీసుకోవద్దు అంటూ చింతమనేని హితవు పలికినట్టు ప్రచారం చేస్తున్నారు. ఎంతో సహనంగా, ఓర్పుతో రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా పాలిస్తున్న చంద్రబాబు బాటలో నడుద్దామని వారికి నచ్చజెప్పినట్టు వివరించారు. వైసిపి నాయకుల దురాగతాలను ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

Also Read: కార్యకర్తల వద్దకు వెళ్లేందుకు జగన్ సంకోచం - బిల్లులు, బెట్టింగ్ బాధితుల భయమా ?