Crypto Currency Fruad: క్రిప్టో కరెన్సీ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతంలో అనేక మంది బాధితులకు మాయమాటలు చెప్పి మోసం చేసిన కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. విజయవాడకు చెందిన సిద్దంశెట్టి ఆనంద కిషోర్ ను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రూ. 20 కోట్ల మేర అమాయకులకు టోకరా వేసినట్లు పోలీసులు గుర్తించారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే సామాన్యుల వీక్ పాయింట్ తో ఆడుకుని కోట్లాది రూపాయలు టోకరా వేశాడు. కట్టిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. 


మోసం ఎలా చేశాడంటే..


రూ. 3.75 లక్షల రూపాయలు ఒక్క సారి కట్టి ఐడీ పొందితే.. ప్రతి రోజూ రూ. 7 వేల చొప్పున 200 రోజుల పాటు ఇస్తామని విజయవాడకు చెందిన సిద్దంశెట్టి ఆనంద కిషోర్ నమ్మబలికాడు. ఒక్కొక్క సభ్యుడు మరొక కొత్త సభ్యుడిని చేరిస్తే.. రూ.30 వేలు, ఇద్దరు సభ్యులను చేర్పిస్తే రూ. 90 వేలు అదనంగా ఇస్తామని మాయమాటలు చెప్పాడు. అలా అమాయకుల నుండి రూ. 82.59 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మొదట్లో అందర్నీ నమ్మించడానికి సక్రమంగా చెప్పినట్లుగా డబ్బులు ఇచ్చాడు. అలా రూ. 25.90 లక్షలు తిరిగి వారికి చెల్లించాడు. ఇందుకోసం గుడివాడకు చెందిన మతి నరేష్, అవనిగడ్డకు చెందిన మానేపల్లి జగదీష్, తుంగల వారి పాలెంకు చెందిన తుంగల లక్ష్మీనరసయ్య మరికొందరితో ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి అమాయకులకు మాయమాటలు చెప్పి వారితో డబ్బు కట్టించే వారు. కొన్ని రోజులు సక్రమంగా డబ్బులు చెల్లించిన నిందితులు తర్వాత వారి పనితనం చూపించడం ప్రారంభించారు. డబ్బులు తీసుకుని వారికి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి వారు పోలీసులను ఆశ్రయించారు. 


ఈ నెల 1వ తేదీన ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెం గ్రామానికి చెందిన భోగిరెడ్డి నాగేశ్వరరావుతో పాటు పలువురు స్పందనలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఆవనిగడ్డ చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుండి డబ్బులు కట్టించుకుని ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ మహబూబ్ బాషా విలేకరుల సమావేశంలో తెలిపారు. 


ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ ఇప్పిస్తానని..


పలు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. అవనిగడ్డ మండలం పులిగడ్డ వారధి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో కారులో అవనిగడ్డ వైపు వెళ్తున్న సిద్ధంశెట్టి ఆనంద కిషోర్ ను అరెస్టు చేశారు. అతని నుండి ల్యాప్ టాప్, సెల్ ఫోన్లతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.  గతంలో 2018 సంవత్సరంలో ఆనంద కిషోర్ ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ ఇప్పిస్తానని విజయవాడకు చెందిన నాగ శ్రీనివాస్ వద్ద నుండి రూ. 5 లక్షల రూపాయలు తీసుకుని మోసగించాడు. ఈ కేసు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లో నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా  నిందితులు ట్రస్ట్ వాలెట్ అనే ఇమిటేషన్ వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. ఆ వెబ్ సైటును ఢిల్లీ నుండి నిర్వహిస్తున్నట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. 


నిందితులంతా కలిసి ప్లాన్ వేస్కొని..


2021 సంవత్సరంలో మత్తి నరేష్ తో కలిసి ట్రస్ట్ వాలెట్ క్రిప్టో కరెన్సీ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పరిసర ప్రాంత ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేసి మోసగించారు. ఈ వ్యవహారంపై గత మార్చి నెలలో ఖమ్మం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కేసులోని నిందితులందరూ కలిసి ముందస్తుగా పథకం వేసుకొని మల్టీ లెవెల్ మార్కెటింగ్ గా మోసాలు చేయడం ప్రారంభించారు.